రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మరోసారి అత్యంత తీవ్రరూపం దాల్చింది. రష్యా భూభాగాలపై ఉక్రెయిన్ సైన్యం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రాత్రి భారీస్థాయిలో డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యా అధీనంలోని క్రిమియా ద్వీపకల్పంతో పాటు దేశంలోని దాదాపు 12 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఈ దాడులకు తెగబడింది. రష్యా సైనిక వ్యవస్థ, ఇంధన మౌలిక సదుపాయాలు, రసాయన కర్మాగారాలే లక్ష్యంగా ఈ డ్రోన్ల పరంపర సాగింది.
ఈ భారీ వైమానిక దాడిపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు రాత్రికి రాత్రే ఉక్రెయిన్కు చెందిన రికార్డు స్థాయిలో 660 డ్రోన్లను విజయవంతంగా కూల్చివేసి అడ్డుకున్నట్లు రష్యా వెల్లడించింది. రష్యా రాజధాని మాస్కో, క్రిమియా ద్వీపకల్పం, నల్లసముద్రం, అజోవ్ సముద్ర ప్రాంతాలపై ఈ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా పేర్కొంది. మాస్కో నగరం వైపు దూసుకొచ్చిన కనీసం 47 డ్రోన్లను కూల్చివేశామని ఆ నగర మేయర్ తెలిపారు. నాలుగు సంవత్సరాల క్రితం యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా భూభాగంపై ఉక్రెయిన్ చేసిన అతిపెద్ద డ్రోన్ దాడుల్లో ఇది ఒకటిగా రక్షణ నిపుణులు భావిస్తున్నారు.
ఈ దాడుల వల్ల రష్యాలోని పలు ప్రాంతాల్లో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాస్కోకు దక్షిణంగా ఉన్న తుల ప్రాంతంలోని ఒక రసాయన కర్మాగారంపై డ్రోన్ల దాడి జరగడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. అలాగే క్రిమియాలోని కీలక రేవు పట్టణమైన కెర్చ్లో రష్యా నౌకాదళ నౌకలు, వైమానిక రక్షణ రాడార్లను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులు చేసినట్లు సమాచారం. ఈ తీవ్రమైన దాడుల నేపథ్యంలో క్రిమియాలోని రష్యా మద్దతు గల అధికారులు అక్కడ అత్యవసర పరిస్థితిని (స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ) ప్రకటించారు. రష్యా యుద్ధ సామర్థ్యాన్ని, సైనిక సరఫరా వ్యవస్థలను బలహీనపరిచే వ్యూహంలో భాగంగానే తాము ఈ దీర్ఘశ్రేణి దాడులను మరింత తీవ్రం చేసినట్లు ఉక్రెయిన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
