గుంటూరు జిల్లాలో అరుదైన నరాల సంబంధిత వ్యాధి ఒకటి వైద్యులను ఆకర్షించింది. జిల్లా ఆత్మకూరుకు చెందిన 36 ఏళ్ల వ్యక్తిలో అత్యంత అరుదుగా కనిపించే కెన్నెడీ వ్యాధి (Kennedy Disease)ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. కాళ్లు, చేతుల కండరాలు క్రమంగా బలహీనపడడం, నడవడంలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో బాధితుడు ఆసుపత్రిని ఆశ్రయించాడు.
రోగి పరిస్థితిని పరిశీలించిన న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలోని వైద్య బృందం పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. పరీక్షల అనంతరం అతను కెన్నెడీ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు.
డాక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, ఈ వ్యాధి జన్యుపరమైన నరాల క్షీణత వ్యాధి. పురుషుల్లో సెక్స్ హార్మోన్ల పనితీరులో మార్పులు రావడం వల్ల శారీరకంగా పురుష లక్షణాలు తగ్గిపోవడంతో పాటు స్త్రీలకు సంబంధించిన కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. చేతులు, కాళ్ల కండరాలు క్రమంగా బలహీనపడటం, కండరాల క్షీణత, శారీరక శక్తి తగ్గడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ప్రధానంగా కనిపిస్తాయి.
ఈ వ్యాధిని 1962లో అమెరికన్ న్యూరాలజిస్ట్ విలియం ఆర్ కెన్నడీ గుర్తించారు. ఆయన పేరుమీదుగానే దీనికి కెన్నెడీ వ్యాధి అనే పేరు వచ్చింది. వైద్యపరంగా దీనిని స్పైనల్ అండ్ బల్బర్ మస్క్యులర్ అట్రోఫీ (SBMA) అని కూడా పిలుస్తారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ వ్యాధి నమోదవుతుందని వైద్యులు తెలిపారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే లక్షణాలను నియంత్రించేందుకు చికిత్సలు, ఫిజియోథెరపీ, జీవనశైలి మార్పులు సహాయపడతాయని సూచించారు. గుంటూరులో ఈ అరుదైన వ్యాధి నిర్ధారణ కావడం వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
