రాజధాని అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతుగా వైసీపీ నాయకులకు బహిరంగ సవాల్ విసురుతున్నానని ఉండవల్లి రైతు దాసరి కృష్ణ అన్నారు. అమరావతి అంశంపై వైసీపీకి ఎప్పుడైనా స్పష్టమైన వైఖరి ఉందా అని ప్రశ్నించారు. 2019కు ముందు అమరావతినే రాజధానిగా సమర్థించిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో మాట మార్చి, ఇప్పుడు కొత్త పేర్లతో రాజధానిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
రాజధాని అంశంపై ఎక్కడైనా, ఎప్పుడైనా వైసీపీ నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఈరోజు తాడేపల్లిలో విధ్వంసానికి ప్రయత్నించిన నాయకుల్లో ఒక్కరికైనా రాజధాని ప్రాంతంలో పొలం ఉందా అని ప్రశ్నించారు. బయట ప్రాంతాల నుంచి రౌడీ మూకలను తీసుకొచ్చి రాజధాని రైతులు, మహిళలపై రాళ్లు, రాడ్లతో దాడులు చేయించడం దారుణమని మండిపడ్డారు.
వైసీపీ నాయకుల రాళ్లదాడిలో ఒక కానిస్టేబుల్ గాయపడి చికిత్స పొందుతున్నాడని, రైతులనే కాదు పోలీసులపై కూడా దాడి చేయడం వారి రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. గాయపడిన కానిస్టేబుల్ను పరామర్శించి, ఆయన చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తాము భరిస్తామని వైద్యులకు తెలిపినట్లు చెప్పారు. కానిస్టేబుల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రాజధాని గ్రామాల్లో మళ్లీ విధ్వంసానికి పాల్పడే ప్రయత్నాలు చేస్తే రైతులంతా కలిసి తగిన రీతిలో బుద్ధి చెబుతామని, ఇదే వైసీపీ నాయకులకు చివరి హెచ్చరిక అని దాసరి కృష్ణ స్పష్టం చేశారు.
