అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో బాక్సైట్ తవ్వకాలు, హైడ్రోపవర్ ప్రాజెక్టుల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని జెడ్పీ ఛైర్పర్సన్ జె. సుభద్ర కోరారు. బాక్సైట్ తవ్వకాలు, హైడ్రోపవర్ ప్రాజెక్టులకు సంబంధించిన సర్వేలను అనుమతించవద్దని విజ్ఞప్తి చేశారు.
అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు బాక్సైట్ తవ్వకాల కోసం ముందస్తు చర్యలు జరుగుతున్నాయని ఆరోపించడంతో పలువురు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి జీవోలు జారీ చేయలేదని, సర్వేలకు కూడా అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అనధికారికంగా సర్వేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, బాక్సైట్ తవ్వకాలపై ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు. ప్రస్తుతం ఎలాంటి జీవోలు లేవని, ఆధారాలు ఉంటే ప్రజల ముందుంచాలని అన్నారు. సమావేశంలో అక్రమ మైనింగ్, వైద్య సేవలు, ఎరువులు, విత్తనాల సరఫరా, అంగన్వాడీ సేవలు, అసంపూర్తి భవనాల నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన 11 మంది జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులను ఘనంగా సత్కరించారు.
