షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో బోటు ప్రమాద బాధితుడు కర్రి చిన్నను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పరామర్శించారు. కర్రి చిన్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
కుటుంబ సభ్యులను కోల్పోవడం జీవితంలో మరచిపోలేని విషాదమని కర్రి చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల కోసం బ్రతకాలనే సంకల్పమే తనను కాపాడిందని తెలిపారు. తనను రక్షించిన మర్చంట్ షిప్ అధికారులు చూపిన మానవత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కర్రి చిన్న అనుభవం తనను తీవ్రంగా కలచివేసిందని ఎమ్మెల్యే అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
సహాయక చర్యల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ ఎం. శ్రీభరత్, పోర్టు అధికారులు, బోటు అసోసియేషన్ ప్రతినిధులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
