విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం వేములాపల్లి సమీపంలోని తాటిపూడి జేఏ ఛానల్ పూడికతీత పనులకు స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శ్రీకారం చుట్టారు. జిల్లా మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) నుంచి రూ.6 లక్షల నిధులతో ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, గత 2014–19 కాలంలో రూ.4.5 కోట్ల వ్యయంతో జేఏ ఛానల్ అభివృద్ధి పనులు చేపట్టి సుమారు 2,600 ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం మధుపాడు నుంచి జాగరం వరకు మొత్తం ఛానల్కు పూర్తి స్థాయిలో పూడికతీత చేపట్టేందుకు అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాదిలోపు ఛానల్ పూడికతీత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, పోలవరం ప్రాజెక్టు పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తాటిపూడి పైలెట్ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని, పెంచిన సామాజిక పెన్షన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
