2019 నాటికి సంక్షేమ బోర్డు ద్వారా అమలులో ఉన్న అన్ని సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పల్నాడు భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
అనంతరం కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్. సిలార్ మసూద్ మాట్లాడుతూ 2019-2026 మధ్య సంక్షేమ బోర్డులో లబ్ధిదారులుగా దరఖాస్తు చేసుకున్న అన్ని క్లెయిమ్లను పరిష్కరించాలన్నారు. అలాగే 2019లో కార్మిక శాఖ ద్వారా అమల్లో ఉన్న 14 రకాల సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను తిరిగి ప్రారంభిస్తున్నామని ప్రకటించి నెలకు పైగా గడిచినా ఇప్పటికీ సచివాలయాల్లో కానీ, కార్మిక శాఖ కార్యాలయాల్లో కానీ దరఖాస్తులు స్వీకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు కార్యాలయాలకు వెళ్లితే ఒకరు సచివాలయాలకు పంపుతుండగా, సచివాలయ సిబ్బంది తమకు ఎలాంటి ఆదేశాలు లేవని చెప్పడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
గతంలో మాదిరిగానే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను కార్మిక శాఖ కార్యాలయాల ద్వారానే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగా మన రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కోట ఆంజనేయులు, గౌరవ అధ్యక్షులు అవ్వారు ప్రసాదరావు, కోశాధికారి ఆంజనేయులు, ఉపాధ్యక్షులు అంగలకుదురు ఆంజనేయులు, నాయకులు కొమ్మల సురేష్, బత్తుల బాలకోటయ్య, రెబ్బ శంకర్, సిహెచ్. తులసిరావు, జి. శ్రీనివాసరావు, బోయిన వెంకటేశ్వర్లు, వెంకటప్పయ్య, షేక్. సైదులు, కుమారి తదితరులు పాల్గొన్నారు.
