బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లలో వేలాది మంది చనిపోవడానికి కారణం బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తీసుకున్న నిర్ణయాలేనని న్యాయస్థానం నిర్ధారించింది. గత ఏడాది విద్యార్థుల ఉద్యమం సమయంలో జరిగిన సంఘటనలకు సంబంధించి మానవత్వానికి విరుద్ధమైన నిర్ణయాలను అప్పటి ప్రధాన మంత్రి షేక్ హసీనా తీసుకున్నారని న్యాయస్థానం నిర్ధారణకు వచ్చింది.
నెలల తరబడి సాగిన విచారణ అనంతరం ఈ తీర్పు వెల్లడైంది. గత సంవత్సరం విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ ఆందోళనను అణిచివేయడానికి మానవ హక్కులను కాలరాసిందని కోర్టు తేల్చింది. ముగ్గురు సభ్యుల ప్రత్యేక ట్రైబ్యునల్, హసీనాతో పాటు ఆమె సన్నిహితులైన మాజీ గృహ మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమాల్, మాజీ పోలీసు చీఫ్ చౌధరీ అబ్దుల్లా అల్-మమున్లపై కూడా తీర్పు ఇవ్వబోతున్నట్టు తెలిపింది.
మమున్ను ట్రైబ్యునల్ ముందు హాజరుపర్చగా, అతను తర్వాత ప్రభుత్వ పక్షసాక్షిగా మారాడు. మిగతా ఇద్దరు హసీనా, కమాల్ పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. వారి గైర్హాజరు విచారణలో నడిపించారు. అభియోగ పక్షం ముగ్గురికీ మరణదండన విధించాల్సిందిగా కోరింది. 2024 జూలై–ఆగస్టు నెలల్లో జరిగిన “జూలై ఉద్యమం”లో 1,400 మందికి పైగా మరణించారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం అంచనా వేసింది.
ఆ సమయంలో హసీనా ప్రభుత్వం విస్తృత భద్రతా దాడులు చేపట్టిందని ఆరోపణ. 2024 ఆగస్టు 5న ప్రభుత్వం కూలిన రోజునే హసీనా దేశం విడిచి భారత్కు వెళ్లిపోయారు. కమాల్ కూడా భారత్లోనే ఆశ్రయం తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం ముహమ్మద్ యునుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇద్దరి అప్పగింత కోరినా భారత ప్రభుత్వం స్పందించలేదు.
అక్టోబర్ 23తో ముగిసిన విచారణ 28 పని రోజులపాటు సాగగా, 54 మంది సాక్షులు ప్రభుత్వ చర్యలపై తమ వాంగ్మూలాలను ఇచ్చారు. ప్రధాన అభియోగం ప్రకారం హసీనా, నిరసనకారుల “నిర్మూలన”కు ఆదేశించిందని ట్రైబ్యునల్ ముందు ఆరోపించబడింది.
ఆయుధాలు ఉపయోగించమని ఆదేశించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, హత్యలు, హత్యాయత్నాలు, హింస, అమానుష చర్యలు వంటి ఐదు ప్రధాన అభియోగాలు ఉన్నాయి. ఢాకా, దాని పరిసర ప్రాంతాల్లో ఆరుగురు నిరాయుధ నిరసనకారులపై జరిగిన కాల్పుల్లో ఆమె పాత్ర ఉన్నట్టు కూడా ఆరోపించారు. తీర్పు వెలువడే ముందు దేశవ్యాప్తంగా కఠిన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఢాకా మెట్రోపాలిటన్ కమిషనర్ షేక్ మద్ సజ్జాద్ అలీ, అగ్నిప్రమాదాలు, పేలుళ్లు లేదా హింసాత్మక చర్యలు చేసే వారిని “చూసిన వెంటనే కాల్చివేయాలి” అని ఆదేశాలు జారీ చేశారు. అవామీ లీగ్ రద్దు చేయబడినప్పటికీ, పార్టీ నేతలు రెండు రోజుల హర్తాల్ కు పిలుపునిచ్చారు. సైన్యం, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ దళాలు, అల్లర్లు నియంత్రించే ప్రత్యేక బలగాలు ICT–BD సముదాయం వద్ద కఠిన నిఘా పెట్టగా, రాజధాని వీధులు బాగా వెలవెలబోయాయి.
అంతర్జాతీయ మీడియాతో హసీనా మాట్లాడుతూ, ఈ కేసును కంగారు కంగారుగా కోర్టు నిర్వహిస్తున్నదని ఆరోపించారు. పాక్షికతలేని అంతర్జాతీయ పర్యవేక్షణలో, అవసరమైతే హెగ్లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో కూడా విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమని ఆమె పేర్కొన్నారు.
యునుస్ ప్రభుత్వం మాత్రం నిజమైన అంతర్జాతీయ విచారణ జరిగితే హసీనా విముక్తి పొందవచ్చనే భయంతోనే దాన్ని నివారించిందని ఆమె ఆరోపించారు. మొదట 1971 విమోచన యుద్ధంలో పాకిస్తాన్కు సహకరించిన వారిని విచారించేందుకు ఏర్పాటు చేసిన ఈ ICT–BD ట్రైబ్యునల్కి, యునుస్ ప్రభుత్వం తర్వాతి దశలో అవామీ లీగ్ నాయకులను విచారించే అధికారం కల్పించేలా అధికార పరిధి విస్తరించబడింది. ప్రస్తుతం అవామీ లీగ్ ఉన్నత నాయకుల్లో చాలామంది జైల్లో ఉండగా, మరికొందరు పరారీలో ఉన్నారు.
