తెలంగాణ సాహిత్య లోకంలో చిరపరిచితమైన పేరు, ప్రఖ్యాత కవి మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కేంద్ర సాహిత్య అకాడమీ తాజాగా ప్రకటించిన వార్షిక పురస్కారాల్లో భాగంగా, వచన కవిత్వ విభాగంలో ఆయన రచించిన “అనిమేష” కవితా సంపుటిని ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేశారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామానికి చెందిన సిధారెడ్డి, తనదైన శైలిలో సామాజిక స్పృహతో కూడిన కవిత్వాన్ని అందిస్తూ దశాబ్దాలుగా సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తన కలం పాటతో ప్రజల్లో చైతన్యం నింపిన ఆయనకు ఈ పురస్కారం దక్కడం తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంజీరా రచయితల సంఘం ఆయనకు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేసింది. ఆయన ప్రతిభకు దక్కిన ఈ గుర్తింపు అక్షర రంగానికి గర్వకారణమని సాహితీవేత్తలు కొనియాడుతున్నారు.
