ఆంధ్రప్రదేశ్లో రోడ్లకు మహర్ధశ పట్టింది. రాజధానితో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఏపీలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నేషనల్ హైవే ప్రాజెక్టులతో పాటు.. డీపీఆర్ దశలో ఉన్న లక్షా 40 వేల కోట్ల రూపాయల విలువైన నేషనల్ హైవేలను 2029 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ప్రకాశం జిల్లా ముప్పవరం నుంచి శ్రీసత్యసాయి జిల్లాలోని కోడూరు వరకు నిర్మాణంలో ఉన్న విజయవాడ – బెంగళూరు ఎకనామిక్ కారిడార్ రహదారిని వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం, మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టును జాతీయ రహదారులతో అనుసంధానించడానికి ప్రణాళిక రూపొందించారు.
పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోని పోర్టులకు మెరుగైన కనెక్టివిటీ కోసం నిర్మిస్తున్న జాతీయ రహదారులను వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని పని చేయాలని.. అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. నాగపూర్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే.. జగదల్పూర్, రాయపూర్ నుంచి మూలపేట పోర్టు వరకు హైవేల పనులు పట్టాలు ఎక్కించేందుకు చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ నుంచి అమరావతి వరకు ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే డీపీఆర్ త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న నేషనల్ హైవేలను అవసరాన్ని బట్టి.. నాలుగు, ఆరు లేన్లకు విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గతుకులు, గుంతల్లేని.. విశాలమైన రోడ్లు ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే ప్రజలకు రోడ్డు ప్రయాణం అంత సౌకర్యవంతంగా మారుతుంది.
అదే సమయంలో సరకు రవాణా ఖర్చులు భారీగా తగ్గుతాయి. వేగంగా సరకు రవాణా చేసేందుకు అనువైన రోడ్లు, మౌళిక వసతులు అందుబాటులో ఉంటే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతుంది. అందుకే రాష్ట్రంలోని 45 వేల కిలోమీటర్ల ఆర్ ఆండ్ బీ.. జిల్లా.. రాష్ట్ర రహదారుల్లో ఎక్కడ గుంతలు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. 2 వేల 500 కోట్లతో 6 వేల కిలోమీటర్ల రోడ్ల పునరుద్ధరణ పనులు ప్రారంభించారు.
