మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ పేలుడు సంభవించి పెను విషాదాన్ని నింపింది. నాగ్పూర్లోని ఎస్.బి.ఎల్ (SBL) ఎనర్జీకి చెందిన బి-20 ప్లాంట్లో జరిగిన ఈ శక్తివంతమైన పేలుడులో కనీసం 15 మంది మరణించగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. పేలుడు తీవ్రతకు పక్కనే ఉన్న బి-16 ప్లాంట్ కూడా దెబ్బతినడమే కాకుండా, అక్కడి కాంక్రీట్ కట్టడాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం, డెటొనేటర్కు వైరును కలుపుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక బృందాలు శిథిలాలను తొలగించే పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండవచ్చని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుడు ధాటికి వచ్చిన శబ్దం కొన్ని కిలోమీటర్ల మేర వినిపించిందని ఎస్పీ హర్ష పొద్దార్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
