మహిళలకు రిజర్వేషన్ పేరుతో నిర్వహిస్తున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాల అసలు ఉద్దేశ్యం వేరే ఉందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ ఆక్షేపించారు. ప్రత్యేక సమావేశాల అసలు ఉద్దేశ్యం నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అని ఆమె పేర్కొన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లులను త్వరితగతిన ఆమోదింపజేయాలనే ప్రయత్నం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా ప్రతిపక్షాలను వెనక్కు నెట్టేయాలని చూస్తున్నారని సోనియాగాంధీ అన్నారు.
డిలిమిటేషన్ విషయంలో కేవలం గణితపరమైన లెక్కలు కాకుండా రాజకీయ సమానత్వం కూడా ఉండాలని సోనియాగాంధీ స్పష్టం చేశారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని, చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గేలా నిర్ణయాలు తీసుకోవడం సముచితం కాదని ఆమె అన్నారు.
ఇక మహిళల రిజర్వేషన్ చట్టం ఇప్పటికే ఆమోదం పొందిందని గుర్తు చేస్తూ, దాని అమలుకు ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు. ఈ చట్టం ప్రకారం జనగణన పూర్తయ్యాక, తదనంతరం డిలిమిటేషన్ జరిగాకే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైనదికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో కుల జనగణన అంశాన్ని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. 2027 జనగణనలో కులాల లెక్కలు సేకరించాలనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, దీనిపై స్పష్టత లేకుండా ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు.
ప్రతిపక్షాలు పలుమార్లు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించాలని కోరినా కేంద్రం స్పందించలేదని తెలిపారు. ప్రజా చర్చకు అవకాశం ఇవ్వకుండా ముఖ్యమైన రాజ్యాంగ సవరణలను త్వరగా ఆమోదించేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమని ఆమె విమర్శించారు.
ఏప్రిల్ 16 నుంచి 18 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరగనున్న నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతిపాదనలపై ఇంకా స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగించే అంశమని ఆమె పేర్కొన్నారు. డిలిమిటేషన్ ప్రక్రియను జనగణన పూర్తయ్యాకే చేపట్టాలని, లేదంటే అది రాజ్యాంగానికి విరుద్ధమవుతుందని హెచ్చరించారు.
మొత్తంగా మహిళల రిజర్వేషన్ కంటే డిలిమిటేషన్ అంశమే ప్రధాన సమస్యగా మారిందని, ఈ ప్రక్రియ దేశ రాజకీయ వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు
