వైసీపీ గూండాలు తిరుపతి నగరంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఆలయ నగరంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు అరాచకానికి పాల్పడేందుకు ప్రయత్నించిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. టీటీడీ ఛైర్మన్ బీ ఆర్ నాయుడు కుటుంబ సమేతంగా తిరుపతికి వెళ్లి నగరంలోని ఓ హోటల్లో బస చేసిన సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
సమాచారం ప్రకారం, వైసీపీకి చెందిన కొంతమంది గూండాలు ఆయన బస చేసిన హోటల్ వద్దకు చేరుకుని న్యూసెన్స్ సృష్టించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు భారీగా హోటల్ వద్దకు చేరుకున్నారు. వైసీపీ అనుచరులు గొడవకు దిగేందుకు ప్రయత్నించగా టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశముండటంతో అక్కడ కొంతసేపు తోపులాట వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో వైసీపీ మూకలు వెనక్కి తగ్గినట్లు సమాచారం. కొందరు అక్కడి నుంచి వెళ్లిపోగా, మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీగా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వైసీపీకి చెందిన రౌడీ మూకలను చెదరగొట్టి ప్రాంతంలో శాంతి భద్రతలను పునరుద్ధరించారు. తిరుపతి వంటి పవిత్ర నగరంలో రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించడం తగదని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ప్రశాంతంగా ఉండే ఆలయ నగరంలో కలహాలు రేపేందుకు ప్రయత్నించడం వెనుక కుట్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆలయ నగరమైన తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
