బీహార్ ప్రభుత్వం 3,035 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వీరు నకిలీ డిగ్రీలు, ఫోర్జరీ చేసిన విద్యార్హత ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు విజిలెన్స్ బ్యూరో దర్యాప్తులో తేలిందని ప్రభుత్వం తెలిపింది.
2006 నుంచి 2015 మధ్య కాలంలో జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విజిలెన్స్ బ్యూరో సుదీర్ఘ దర్యాప్తు చేపట్టింది. విజిలెన్స్ అధికారులు సమర్పించిన సమగ్ర నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ఈ కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. కేవలం ఉద్యోగాల నుంచి తొలగించడమే కాకుండా, సదరు ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే ఈ స్కామ్ తో సంబంధం ఉన్న పలువురిపై ఎఫ్ఎఆర్ (FIR) నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
తప్పు చేసిన వారెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. సంబంధిత ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే అనేక ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు. వారు ఉద్యోగంలో ఉన్న కాలంలో పొందిన జీతాలు, గౌరవ వేతనాలను వడ్డీతో సహా తిరిగి వసూలు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
