తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఒక అద్భుత శకం ముగిసింది. సుప్రసిద్ధ నేపథ్య గాయని, సంగీత సరస్వతి ఎస్. జానకి (88) మైసూర్ లో గుండెపోటుతో కన్నుమూశారు. మైసూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె హఠాన్మరణం చెందారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు.
1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లపట్ల గ్రామంలో జన్మించిన ఎస్. జానకి, తెలుగు చలనచిత్ర సీమలో ఆణిముత్యం లాంటి పాటలకు ప్రాణం పోసి మధుర గాయనిగా అపార ఖ్యాతి గడించారు. 1957లో ‘వితియన్’ సినిమాతో తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె, ప్రకృతి సైతం తన్మయత్వంలో మునిగిపోయేలా ఆలపించడమే కాకుండా, పాటలతో మిమిక్రీ చేసి చూపిన అరుదైన ప్రతిభను సొంతం చేసుకున్నారు.
తొలితరం గాయకుడు ఘంటసాల నుంచి మలితరం ఎస్.పి. బాలసుబ్రమణ్యం వరకు ఎందరో దిగ్గజాలతో కలిసి ఆమె అద్భుత గీతాలను ఆలపించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సహా వివిధ భాషల్లో సుమారు 50 వేలకు పైగా పాటలు పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.
సుదీర్ఘమైన ఆమె కెరీర్ లో మొత్తం 32 ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. ఉత్తమ గాయనిగా నాలుగు సార్లు జాతీయ పురస్కారాలను అందుకున్న జానకమ్మ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 10 నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. అలాగే కేరళ ప్రభుత్వం నుంచి 11 అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆరు అవార్డులు, ఒడిస్సా నుంచి ఒక అవార్డును పొందారు. 1986లో ప్రత్యేక సినీ అవార్డు, 1997లో ఫిలింఫేర్ అవార్డు, 2002లో అచీవర్ అవార్డు, 2005లో స్వర్ణాలయ జేసుదాసు ప్రత్యేక అవార్డులను అందుకున్నారు. 2009లో ఆమెను గౌరవ డాక్టరేట్ తో సత్కరించగా, సైమా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో పాటు 2017లో వేటూరి జీవన సాఫల్య పురస్కారం లభించాయి. భారత ప్రభుత్వం ఆమె అద్భుత గాన కళా సేవలను గుర్తిస్తూ 2013లో పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఎస్. జానకి మరణం భారతీయ చలనచిత్ర రంగానికి, ముఖ్యంగా దక్షిణ భారత సంగీత ప్రపంచానికి తీరని లోటు.
