తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద మహిళా పోలీసుల పట్ల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరుపై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 7న గేట్ నంబర్ 3 వద్ద చోటుచేసుకున్న ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)కు ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసుల గౌరవం, భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాజకీయ పోరాటం పేరుతో మహిళలను అవమానిస్తారా?
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాప్రతినిధులు హుందాతనంతో వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని ఎంపీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, విధుల్లో ఉన్న మహిళా పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించడం, వారిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు.
విధుల్లో ఉన్న మహిళా సిబ్బందినే లక్ష్యంగా చేసుకోవడం దారుణం
మహిళా పోలీసులను ఉద్దేశించి అసభ్యకర, లింగ వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు బీఆర్ఎస్ నేతలు చొక్కాలు విప్పి బనియన్లతో మహిళా పోలీసులకు సమీపంలో నిలబడటం, భద్రతా వలయాన్ని ఛేదించే ప్రయత్నంలో తోపులాట చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకరమని ఎంపీ డా. కడియం కావ్య పేర్కొన్నారు.
మహిళల ఆత్మగౌరవంతో ఆటలా?
మహిళల గౌరవం, ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సమాజానికి ఎలాంటి సందేశం వెళ్తుందని ఎంపీ ప్రశ్నించారు. మహిళా పోలీసులపై జరిగినట్లు పేర్కొన్న దురుసు ప్రవర్తనను రాజకీయ అంశంగా కాకుండా మహిళల గౌరవం, హక్కులకు సంబంధించిన తీవ్రమైన అంశంగా చూడాలని ఎన్సీడబ్ల్యూను కోరారు.
ఎన్సీడబ్ల్యూ తక్షణమే స్పందించాలి
మీడియాలో ప్రసారమైన కథనాలు, వీడియో ఆధారాలు, అధికారిక సమాచారాన్ని పరిశీలించి జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకు సమగ్ర దర్యాప్తు కోసం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సంబంధిత ప్రజాప్రతినిధులను కమిషన్ ఎదుట హాజరుపరిచి వివరణ తీసుకోవాలని సూచించారు.
మహిళా పోలీసుల గౌరవానికి రక్షణ కల్పించాలి
రాజకీయ నిరసనలు, ఆందోళనల సమయంలో మహిళా పోలీసుల పట్ల ఎలాంటి అవమానకర ఘటనలు పునరావృతం కాకుండా కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని ఎంపీ డా. కడియం కావ్య కోరారు. చట్టాన్ని అమలు చేసే మహిళా సిబ్బందినే బెదిరించే లేదా అవమానించే పరిస్థితులు ప్రజాస్వామ్యంలో ఉండకూడదని స్పష్టం చేశారు.
