మెదక్హోమ్

ఎబోలా కేసులు నమోదు కాలేదు: మంత్రి రాజనర్సింహ

#DamodarRajaNarasimha

రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఎబోలా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలోకి ఎబోలా ఎంటర్ అవకుండా ఎయిర్‌పోర్టులోనే పటిష్ట చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. ప్రజారోగ్య రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆరోగ్య వ్యవస్థ సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.

ఈ మేరకు ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ఎబోలా నివారణ, ముందస్తు జాగ్రత్తలు, సన్నద్ధతపై మంత్రి సమీక్ష చేశారు‌. హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఎబోలా కేసులు నమోదు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా.. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ వంటి ఎబోలా బాధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే  స్క్రీనింగ్, థర్మల్ స్కానింగ్ చేస్తూ వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు.

అత్యవసర పరిస్థితులు ఎదర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం…

విమానాశ్రయంలో డాక్టర్లు,  హెల్త్ ఇన్‌స్పెక్టర్లు, ఫీల్డ్ స్టాఫ్, పారామెడికల్ సిబ్బందితో ప్రత్యేక బృందం విధులు నిర్వహిస్తోందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం  108 అంబులెన్స్‌‌లను 24 గంటలపాటు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.  గాంధీ హాస్పిటల్‌లో 10 పడకల ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశామన్నారు. జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ, డాక్టర్‌ సునీల్ కుమార్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించామని తెలిపారు. అనుమానితుల సాంపిల్స్ టెస్ట్ చేయడం కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV), పుణేకు సాంపిల్స్ పంపించనున్నారు‌.

ఎబోలా వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చిన, లక్షణాలు లేని ప్రయాణికులను 21 రోజుల పాటు ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు. వీరిపై జిల్లా నిఘా బృందాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు వివరించారు. ఈ నెల 25వ తేదీ నాటికి 58 మంది ప్రయాణికులు ఎబోలా వ్యాప్తి ఉన్న దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చారని, వీరిలో ఎవరికీ వ్యాధి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. వీరిని  Category-I కింద వర్గీకరించి, 21 రోజుల హోమ్ ఐసోలేషన్‌లో ఉంచామని వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న ప్రయాణికులను వెంటనే గాంధీ హాస్పిటల్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. విమానాశ్రయ అధికారులు, జిల్లా నిఘా బృందాలు, హాస్పిటల్స్ మధ్య సమన్వయం పటిష్టంగా ఉండాలన్నారు.

Related posts

దాసరి నారాయణరావు ఒక ఇన్స్టిట్యూషన్

Satyam News

ఏరో డ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం శత శాతం పూర్తి

Satyam News

గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి దర్శనం కు మార్గం సుగమం

Satyam News

శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తీసుకుంటున్న ఆంధ్ర

Satyam News

కేరళలో ఫీజుల పెంపుపై విద్యార్ధుల నిరసన

Satyam News

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై భారత్‌లో ప్రకంపనలు!

Satyam News

Leave a Comment