సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ తో కలిసి సోమవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ యూనియన్ కార్యదర్శి సుధాంశ్ పంత్ సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పేద, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం అమలవుతున్న ముఖ్య సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించారు. వీటిలో ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ విద్యార్థి స్కాలర్ షిప్స్ , పౌర హక్కుల రక్షణ వ్యవస్థ, ఎస్సీ/బీసీ హాస్టళ్ల నిర్మాణం, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సమగ్ర పునరావాసం, అలాగే జాతీయ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ వంటి అంశాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సుధాంశ్ పంత్ మాట్లాడుతూ కేంద్ర పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని ప్రశంసించారు. గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, మరింత కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. సమాజంలోని వెనుకబడిన, బలహీన వర్గాల సామాజిక-ఆర్థికాభివృద్ధి కోసం నిరంతర కృషి అవసరమని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన పెండింగ్ సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మరింత ఆర్థిక సహాయం పొందడానికి ఆస్కారం ఉందని, దీని ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మరింత విస్తృత ప్రయోజనాలు అందుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ పేరెంటల్ సపోర్ట్ చట్టాన్ని ఒక ప్రగతిశీల చర్యగా ప్రశంసిస్తూ, సామాజిక రక్షణలో ఇది ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కేంద్ర పథకాల ప్రస్తుత స్థితిపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సమగ్రంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, కొనసాగుతున్న కార్యక్రమాలు, అమలు విధానాలను వివరించడంతో పాటు, కేంద్రం నుండి మద్దతు మరియు స్పష్టత అవసరమైన కొన్ని విధాన ప్రక్రియ సంబంధిత అంశాలను కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో పాటు ఎస్సీ, బీసీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు, ఇతర సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.
