సినిమా హోమ్

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ధర్మేంద్ర

#Dharmendra

ప్రముఖ నటుడు ధర్మేంద్ర బ్రీచ్ కాండీ ఆసుపత్రి నుండి బుధవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. 89 సంవత్సరాల వయస్సు గల ఈ సీనియర్ నటుడు కొద్ది రోజుల క్రితం కొన్ని వైద్య పరీక్షల కోసం దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు.

అయితే ఆయనను ఏ పరీక్షల కోసం చేర్చారో కుటుంబ సభ్యులు లేదా ఆసుపత్రి అధికారులు వెల్లడించలేదు. ధర్మేంద్ర ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుండటంతో వైద్యుల సలహా మేరకు ఇంటి వద్దే చికిత్స కొనసాగించాలని కుటుంబం నిర్ణయించింది. కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో “ధర్మేంద్రని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.

ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారు. ఈ సమయంలో మీడియా, ప్రజలు మరింత ఊహాగానాలకు లోనుకాకుండా ఆయనకు, మా కుటుంబానికి గౌరవం చూపాలని మనవి చేస్తున్నాం” అని పేర్కొన్నారు. ధర్మేంద్ర కుమారుడు సన్నీ దియోల్ తరఫున విడుదల చేసిన ప్రకటనలో, “మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు మా కుటుంబం కృతజ్ఞతలు తెలుపుతోంది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారని మాకు తెలుసు.

ఆయన కూడా తన అభిమానులను ఎంతో ఇష్టపడతారు, కాబట్టి దయచేసి ఆయనకు గౌరవం ఇవ్వండి” అని తెలిపారు. ఆసుపత్రిలో ధర్మేంద్రకు చికిత్స అందించిన డాక్టర్ ప్రతిత్ సాందాని కూడా “ధర్మేంద్ర ఉదయం 7:30 ప్రాంతంలో డిశ్చార్జ్ అయ్యారు. కుటుంబం నిర్ణయం మేరకు ఆయనకు ఇంట్లోనే చికిత్స కొనసాగుతుంది” అని తెలిపారు.

మంగళవారం కొన్ని మీడియా సంస్థలు ధర్మేంద్ర మరణించినట్లు తప్పుడు వార్తలు ప్రసారం చేయగా, కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. ఆయన కుమార్తె ఈషా దియోల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ “నా తండ్రి ఆరోగ్యంగా ఉన్నారు, కోలుకుంటున్నారు. దయచేసి మా కుటుంబానికి గోప్యత ఇవ్వండి. ప్రార్థనలు చేసినందుకు ధన్యవాదాలు” అని రాసింది.

ధర్మేంద్ర భార్య, నటి మరియు రాజకీయ నాయకురాలు హేమామాలిని కూడా మీడియా ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇలాంటి తప్పుడు వార్తలను ప్రసారం చేయడం అసహ్యకరమైన విషయం. చికిత్స పొందుతూ కోలుకుంటున్న వ్యక్తి గురించి ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం చాలా బాధాకరం.

దయచేసి కుటుంబ గోప్యతను గౌరవించండి” అని ఆమె ఎక్స్‌లో రాశారు. ధర్మేంద్రను పరామర్శించడానికి బాలీవుడ్ ప్రముఖులు షారుక్ ఖాన్, ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితరులు ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన జూహూ లోని సన్నీ దియోల్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

Related posts

విత్తన పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఆఫ్రికా ప్రతినిధులు

Satyam News

శ్రీలక్ష్మిని భూమన అవమానిస్తే సాక్షి సిగ్గుపడిందా?

Satyam News

‘టీమ్ ఇండియాగా ముందుకు సాగాలి’

Satyam News

Leave a Comment

error: Content is protected !!