అధికారంలో ఉండగా అభివృద్ధి అనే పదాన్ని మర్చిపోయిన పార్టీ వైసీపీ. అవినీతి ముద్దు.. అభివృద్ధి వద్దు.. అనే స్లోగన్ ఫ్యాన్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. అలాంటి దారుణమైన పాలన గురించి ప్రజలు అప్పుడే మర్చిపోయారని జగన్ అండ్ కో అనుకొంటున్నారు. అందుకే జగన్ హయాంలోనే విశాఖను విశ్వ నగరం రేంజ్లో డెవలప్ చేశామని బిల్డప్పులు ఇస్తున్నారు. కంపెనీలను తరిమేయడమే గానీ.. తీసుకురావడం అనేది జగన్ హిస్టరీలో బూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. అయినా సరే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విశాఖలో చేస్తున్న డెవలప్మెంట్ మొత్తం జగన్ ఖాతాలో వేయాలంటున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. బిల్డప్ బాబాయ్కి కూడా మతిపోయే రేంజ్లో వైసీపీ పాలన గురించి ఎలివేషన్లు ఇస్తున్నారు.
వాస్తవానికి రుషికొండకు గుండు కొట్టి.. 500 కోట్లతో ప్యాలెస్ కట్టించుకోవడం మినహా.. విశాఖలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. 2019కి ముందే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆదానీ డేటా సెంటర్ తీసుకొస్తే.. అంత పెద్ద కంపెనీ మాకు వద్దు అని ప్రాజెక్టును రద్దు చేసింది జగన్ ప్రభుత్వమే. దసపల్లా భూములు, రామానాయుడు స్టూడియో స్థలం, టీడీఆర్ బాండ్ల కుంభకోణం, బీచ్రోడ్డులో కబ్జాలు.. ఇలా చెప్పుకొంటూ పోతే.. వైజాగ్లో వైసీపీ అవినీతి.. అంతు లేని కథలా సాగుతూనే ఉంటుంది. ఇక కూటమి ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చామని ప్రకటించగానే.. ఆ ప్రాజెక్టు వల్ల రేడియేషన్ వస్తుందని.. కరెంటు పోతుందనీ.. నీళ్లు తాగేస్తుందనీ.. అనేక రకాల విష ప్రచారాలు చేసిందీ.. ఇదే వైసీపీ బ్యాచ్.
కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడులపై వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసినా.. ప్రజల నుంచి మాత్రం సానుకూల స్పందన వచ్చింది. పబ్లిక్ పాజిటివ్గా ఉన్నారని తెలియగానే.. జగన్ పార్టీ రివర్స్ గేర్ వేసింది. ఈ పెట్టుబడులన్నీ జగన్ వల్లనే వచ్చాయని ప్రచారం ప్రారంభించారు. వైసీపీకి అభివృద్ది అంటే అస్సలు గిట్టదని.. ఆ పార్టీ నేతలు గట్టిగానే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఫ్యాన్ పార్టీ పెద్దలు ఎన్ని కుట్రలు చేసినా.. ఎంత అడ్డం పడినా.. అభివృద్ధి వైపు అడుగులు పడితే.. ఏ మాత్రం సిగ్గు పడకుండా.. ఆ డెవలప్మెంట్కి కారణం జగన్రెడ్డే అని.. క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తారు. సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం.. విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రణాళిక ప్రకటించగానే.. అది కూడా వైసీపీ ఘనతే అని చెప్పుకొంటున్నారు. ఇసుకలో మేడలు కట్టినా పర్వాలేదు.. గాల్లో గ్రాఫిక్స్ చూపించే గాలి కబుర్లు చెబితినే.. పబ్లిక్లో పరువు పోతుంది. ఎవరు ఏమనుకున్నా.. వైసీపీ నేతలు మాత్రం వాళ్ల ఆల్టర్నేటివ్ రియాల్టి నుంచి బయటకు రావడం లేదు.
