దేశంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోందని, వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఎన్ఎస్యూఐ రామడుగు మండల అధ్యక్షుడు జవ్వాజి అజమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూలై 24న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఆశలను ప్రశ్నాపత్రాల లీకేజీలు దెబ్బతీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళనలకు సమాధానం ఇవ్వాల్సిన పాలకులు, నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై ఢిల్లీలో లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.
విద్యారంగానికి తగిన ప్రాధాన్యత, నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల హక్కులను పరిరక్షించడం, విద్యా వ్యవస్థను కాపాడడం, విద్యార్థుల భవిష్యత్తును రక్షించడం లక్ష్యంగా ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఏఐఎఫ్డీఎస్, ఏఐఎస్బీ, ఏఐపీఎస్యూ, బీజీవీఎస్ తదితర విద్యార్థి సంఘాల సంయుక్త పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ బంద్కు మేధావులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి విజయవంతం చేయాలని జవ్వాజి అజమ్ విజ్ఞప్తి చేశారు.
