తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో అత్యంత పాశవికమైన డబుల్ మర్డర్ కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు, అడ్డువచ్చిన అత్తను కూడా ఒక కిరాతకుడు కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోడదాసి పండు అలియాస్ సీతారామరాజు తన భార్య లతను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలు మొదలవ్వడంతో మనస్పర్థలు వచ్చి విడివిడిగా ఉంటున్నారు.
భర్తకు దూరంగా ఉంటున్న లత, కొన్నాళ్ల పాటు కోటి కేశవరం గ్రామంలోని తన సోదరి ఇంట్లో నివసించింది. ఇటీవలె ఆమె తిరిగి బొబ్బిల్లంకలోని తన తల్లి లక్ష్మి వద్దకు చేరుకుంది. భార్య తన వద్దకు రావడం లేదనే కక్షతో ఉన్న పండు, గత రాత్రి ఒక్కసారిగా భార్య, అత్తపై కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై తల్లి, కూతుళ్లు ఇద్దరూ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
సమాచారం అందుకున్న సీతానగరం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు పండును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, నిందితుడికి గతంలోనే నేరచరిత్ర ఉందని వెల్లడించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
