దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇద్దరు టీటీడీ కళాకారుల కుటుంబాలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మానవతా దృక్పథంతో సాయం చేశారు. కె. చక్రవర్తి (వయోలిన్ కళాకారుడు), కె. నాగరాజుచెట్టి (తబలా కళాకారుడు) హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్డిపిపి) తరపున సత్రవాడలోని టిటిడి ఆలయంలో నిర్వహించే హరికథ కార్యక్రమంలో భక్తి సేవలను అందిస్తుంటారు.
ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వడమాలపేట –పూడి క్రాస్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. హెచ్డిపిపి, టిటిడి అప్పగించిన భక్తి సేవను నిర్వహించేందుకు వెళ్తున్న సమయంలో ఈ కళాకారులు అకాల మరణం చెందడం వారి కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని, ఆర్థిక ఇబ్బందులను కలిగించింది.
ఈ నేపథ్యంలో, విధి నిర్వహణకు వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మరణించినందున హెచ్డిపిపి, టిటిడి ద్వారా నియమించబడిన ప్రైవేట్ కళాకారులకు ఆర్థికంగా ఆదుకోవాలని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిపిపి సెక్రటరీని కోరగా ఇప్పుడున్న నిబంధనలు దృష్ట్యా ఎటువంటి సహాయం చేయుటకు అవకాశం లేదని తెలిపారు. దాంతో ఆయన ఈ సమస్యను వెంటనే టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడుకు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు తెలిపారు.
వారి కుటుంబం అసాధారణమైన, దురదృష్టకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఈ కేసును ప్రత్యేక మానవతా దృక్పథంతో పరిశీలించి వారికి సహాయ సహకారాలు అందించవలసిందిగా ఆయన కోరడం జరిగింది. చైర్మన్, ఈవో వెంటనే స్పందించి హెచ్డిపిపి నిధి నుండి మరణించిన ప్రతి కళాకారుని కుటుంబ సభ్యులకు రూ.25,000/- (రూపాయలు ఇరవై ఐదు వేల మాత్రమే) చొప్పున అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం తక్షణమే విడుదల చేయుటకు అనుమతి మంజూరు చేశారు.
చక్రవర్తి, నాగరాజుచెట్టి వారి కుటుంబ సభ్యులు/చట్టబద్ధ వారసులకు ప్రత్యేక మానవతా చర్యగా రూ.5,00,000/- (రూపాయలు ఐదు లక్షలు మాత్రమే) చొప్పున ఎక్స్గ్రేషియా ఆర్థిక సహాయం మంజూరు చేశారు. మరణించిన కళాకారులకు సంతానం ఉన్నట్లయితే, వారి పిల్లల విద్యాభ్యాసం టిటిడి కల్పించే దిశగా ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకున్న చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర కు భాను ప్రకాష్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
