ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 22న విచారణకు రావాలని ఆదేశించింది. జగన్ హయాంలో తీసుకువచ్చిన మద్యం విధానం ద్వారా పెద్ద ఎత్తున ముడుపులు సేకరించారనే ఆరోపణలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ విచారణ చేస్తోంది. ఈ కేసులో విజయసాయిరెడ్డిని నిందితుడిగా చేర్చడంతో పాటు గతంలో ఆయనను ప్రశ్నించింది.
మరోసారి విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన విచారణకు హాజరుకాలేదు. కానీ ఆయన ఇప్పటికే చాలా విషయాలు చెప్పారని తెలుస్తోంది.
తాజాగా విజయసాయికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. 2019 – 2024 మధ్య ఐదేళ్ల కాలంలో మద్యం విక్రయాల ద్వారా దాదాపు రూ. 3,500 కోట్ల మేర అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు సిట్ నిర్ధారించింది.
బ్రాండెడ్ మద్యాన్ని బ్యాన్ చేసిన జగన్ సర్కార్ లోకల్ తయారీ మద్యం మాత్రమే అమ్మేలా చేసి ప్రతి కేసుపై రూ. 150 నుండి రూ.200 వరకు లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో హైదరాబాద్లోని విజయసాయిరెడ్డి నివాసంలోనే ఈ మద్యం పాలసీకి సంబంధించిన సమావేశాలు జరిగాయని, ఈ అక్రమ సొమ్మును హవాలా మార్గాల్లో మళ్లించారని సమాచారం.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి సహా ఇతర నిందితుల వాంగ్మూలాల్లో విజయసాయిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. గతంలో సిట్ విచారణకు హాజరైనప్పుడు ఆయన తనను తాను విజిల్బ్లోయర్ గా చెప్పుకుంటూ, రాజ్ కేసిరెడ్డే అసలు సూత్రధారి అని పేర్కొన్నారు.
అయితే, విజయసాయిరెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు ఆధారాలు లభించడంతో ED ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద లోతుగా విచారించేందుకు సిద్ధమైంది.
గతంలో జగన్ ఆర్థిక వ్యవహారాలను విజయసాయిరెడ్డే చూసేవారు. అక్రమ ఆస్తుల వ్యవహారాలు, సూట్కేసు కంపెనీలు, మనీ లాండరింగ్ వంటి అంశాల్లో విజయసాయిరెడ్డికి పట్టుంది.ఐతే ఇప్పుడు ఆయన వైసీపీకి, జగన్కు దూరంగా ఉంటున్నారు. మరీ ఈడీ విచారణలో విజయసాయిరెడ్డి ఎలాంటి విషయాలు చెబుతారనేది ఆసక్తిగా మారింది.
