నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని వర్ని మండలంలో నకిలీ నోట్ల వ్యవహారం కలకలం సృష్టించింది. జలాల్పూర్ గ్రామానికి చెందిన శాయిలు అనే రైతు తన పంట రుణాన్ని చెల్లించడానికి కెనరా బ్యాంక్ శాఖకు వెళ్లగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సుమారు 2.08 లక్షల రూపాయల విలువైన 500 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసే క్రమంలో, అవి నకిలీవని గుర్తించిన క్యాషియర్ పోలీసులకు సమాచారం అందించారు.పోలీసుల విచారణలో శాయిలు ఆ డబ్బును తన కుమారుడు ఇచ్చాడని తెలిపారు.
అయితే, ఇటీవలి సర్పంచ్ ఎన్నికల సమయంలో ఓ అభ్యర్థి ఈ నకిలీ నోట్లను పంపిణీ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ముఖ్యంగా, ఒక జాతీయ పార్టీ మద్దతుతో గెలిచిన అభ్యర్థికి సంబంధించిన అనుచరుల ద్వారా ఈ నగదు చలామణిలోకి వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
సదరు అభ్యర్థి రాజకీయంగా కీలక నేత అయిన పి.శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితుడని ప్రచారం జరుగుతుండటంతో, ఈ కేసును త్రొక్కిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ నకిలీ నోట్ల మూలాలపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
