ఏపీలో ఒక ఎమ్మెల్యే తెల్లవారుజామున ఒక్కరే బైక్ లో హెల్మెట్ ధరించి నగర వీధుల్లో తిరిగారు. చెత్తా చెదారం, డ్రైనేజీల పరిస్థితిని నేరుగా పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు వచ్చే మస్టర్ పాయింట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అప్పటివరకు ఎమ్మెల్యే నగరంలో తిరుగుతున్నారని ఇటువంటి అధికారులకు కార్మికులకు తెలియలేదు. ఇంతకీ ఎవరు ఆయన అంటే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. తెల్లవారుజామున ఐదున్నర గంటలకే ఆయన బ్లాక్ టీ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకొని బైక్ పై హెల్మెట్ ధరించి ఆకస్మిక తనిఖీలు చేస్తూ నగరంలో పరిస్థితుల గురించి తెలుసుకున్నారు.
పవర్ ఆఫీస్ వద్ద ఉన్న మస్టర్ పాయింట్ ను తనిఖీ చేసి పారిశుద్ధ్య కార్మికులు ఎంతమంది ఉన్నారు… ఇందులో రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎంతమంది ఉన్నారన్నది ఆరా తీశారు. కొంతమంది రెగ్యులర్ ఉద్యోగుల స్థానంలో బదిలీ వర్కర్లు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత వైసిపి ప్రభుత్వం నుంచి ఇది అలవాటైందన్నారు. అనారోగ్య పరిస్థితులు లేదా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బదిలీ వర్కర్లకు అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఓల్డ్ టౌన్ ప్రాంతంలో పలు కాలనీల్లో బైక్ పై తిరుగుతూ పారిశుద్ధ్య సమస్యలు నేరుగా తెలుసుకున్నారు.
కొంతమంది చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి సూచించారు. ఓల్డ్ టౌన్ లోని అన్న క్యాంటీన్ తనిఖీ చేశారు.
అక్కడ భోజనం నాణ్యతను తెలుసుకునేందుకు అల్పాహారం తిన్నారు. ఇవాల్టి మెనూలో ఇడ్లీ పూరి బాగుందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మేయర్ కార్పొరేటర్లు ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. పారిశుద్ధ్య సమస్యపై శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఎంహెచ్ఓ క్షేత్రస్థాయిలో కచ్చితంగా పరిశీలించాలన్నారు.
తాను కూడా ఇలా ఉదయం, సాయంత్రం వేళల్లో కచ్చితంగా ఎక్కడో ఒకచోట ఆకస్మిక తనిఖీలు చేస్తుంటానని చెప్పారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను మూసివేసి పేదవాని పొట్ట కొట్టారని విమర్శలు చేశారు.
