సంపాదకీయంహోమ్

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా!

#YSSunitha

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ప్రవర్తించిన జగన్ తీరు…ఇప్పుడు సాయికృష్ణ కేసులో ఆయన చేస్తున్న రాజకీయంతో మరోసారి తెరపైకి వచ్చింది.

బాధితుడి తరఫున విచారణ కోరడం తప్పు కాకపోయినా, గతంలో CBI విచారణను అడ్డుకున్న జగన్.. ఇప్పుడు సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలంటూ అదే  CBI విచారణను డిమాండ్ చేయడం వెనుక కేవలం రాజకీయ లబ్ధి మాత్రమే కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో వైఎస్ వివేకా దారుణ హత్యకు గురైనప్పుడు, అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి వెంటనే  CBI విచారణ కావాలని డిమాండ్ చేశారు. తీరా 2019లో తాను అధికారంలోకి రాగానే, ఆ డిమాండ్‌ను పక్కన పెట్టేసి రాష్ట్ర పోలీసుల చేతే దర్యాప్తు చేయిస్తామంటూ కోర్టుల్లో పిటిషన్లు వేయించారు.

సొంత బాబాయ్ దారుణంగా హత్యకు గురై, ఆయన కూతురు డాక్టర్ సునీత న్యాయం కోసం ఒంటరిగా కోర్టుల చుట్టూ తిరుగుతూ, ప్రాణభయంతో పోరాడుతుంటే అండగా నిలవాల్సిన అన్న.. అధికారం చేతిలో ఉన్న ఐదేళ్లూ ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు. అప్పుడు పనికిరాని సీబీఐ, ఇప్పుడు సాయికృష్ణ కుటుంబానికి ఎలా న్యాయం చేస్తుందో జగనే సమాధానం చెప్పాలి.

ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే తెలుగులో ఓ సామెత గుర్తొస్తోంది…సొంత తల్లికి అన్నం పెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట. కన్న తల్లి లాంటి సొంత రక్తం, బాబాయ్ కూతురు సునీతకు న్యాయం చేయని జగన్..ఈరోజు సాయికృష్ణ కుటుంబంపై చూపిస్తున్న ప్రేమ అంతా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని స్పష్టమవుతోంది. సొంత బాబాయ్ కేసులో నిందితులను కాపాడేందుకు వ్యవస్థలను వాడుకున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తి, నేడు మరొకరి కేసులో సీబీఐ దర్యాప్తు కోరడం కంటే విచిత్రం మరొకటి లేదు.

ప్రస్తుతం అధికారం కోల్పోయిన వైఎస్ జగన్, ప్రజల్లో తన ఉనికిని చాటుకోవడానికి, కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి ఇలాంటి సున్నితమైన కేసులను ఆయుధంగా మలచుకుంటున్నారనేది స్పష్టమైన కోణం. నాడు అధికార బలంతో వివేకా కేసును పక్కదారి పట్టించి, నేడు ప్రతిపక్షంలోకి రాగానే సాయికృష్ణ కేసు నెపంతో పరామర్శల రాజకీయం చేయడం కేవలం మైలేజ్ కోసమే. న్యాయం జరగాలనే నిజాయితీ గల ఆకాంక్ష కంటే..శవాల మీద పేలాలు ఏరుకునే చందంగా రాజకీయ లబ్ధి పొందడమే జగన్ అసలు వ్యూహమనేది విశ్లేషకుల మాట.

Related posts

జన నాయకన్ ఇక విడుదల కాదా….?

Satyam News

బిష్ణోయ్ గ్యాంగ్ తో భారత్ కలిసి పని చేస్తున్నదా?

Satyam News

సీఎం చంద్రబాబు వాహన శ్రేణి కుదింపు

Satyam News

త్వరలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ?

Satyam News

ఒకే ఆట… 665 ఏళ్లుగా…. మరో సారి…

Satyam News

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌… వైజాగ్‌లో డెలాయిట్‌

Satyam News

Leave a Comment