న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ వేదికగా గల్గోటియాస్ యూనివర్సిటీ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. చైనాకు చెందిన ఒక రోబోటిక్ డాగ్ను తమ స్వంత ఆవిష్కరణగా ప్రదర్శించిందనే ఆరోపణలు రావడంతో ఈ వివాదం మొదలైంది.
సదస్సులో యూనివర్సిటీ ప్రతినిధి ఒకరు మీడియాలో మాట్లాడుతూ తమ విద్యార్థులు, ఫ్యాకల్టీ కలిసి ‘ఓరియన్’ అనే రోబోటిక్ డాగ్ను అభివృద్ధి చేశారని, దీని వెనుక సుమారు 350 కోట్ల రూపాయల AI ఎకోసిస్టమ్ ఉందని ప్రకటించారు. అయితే, సోషల్ మీడియాలో నెటిజన్లు దీనిని చైనా కంపెనీ అయిన ‘యూనిట్రీ రోబోటిక్స్’ (Unitree Robotics) తయారు చేసిన ‘Go2’ మోడల్ రోబోగా గుర్తించారు.
ఆన్ లైన్లో సుమారు 2 నుండి 3 లక్షల రూపాయలకు లభించే ఈ విదేశీ ఉత్పత్తిని తమ స్వదేశీ పరిజ్ఞానంగా ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ ఘటన భారత ప్రభుత్వానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఇబ్బందికరంగా మారడంతో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. వెంటనే గల్గోటియాస్ యూనివర్సిటీ స్టాల్ను సదస్సు నుండి ఖాళీ చేయాలని ఆదేశించడమే కాకుండా, వారి పవిలియన్కు విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేసినట్లు సమాచారం.
ఇది కేవలం రోబోటిక్ డాగ్ వివాదానికే పరిమితం కాకుండా, యూనివర్సిటీ ప్రదర్శించిన డ్రోన్ సాకర్ వంటి ఇతర ప్రాజెక్టులు కూడా విదేశీ కంపెనీల ఉత్పత్తులేనని ఆరోపణలు వచ్చాయి. విదేశీ సాంకేతికతను స్వదేశీ ఆవిష్కరణగా చూపడం జాతీయ విశ్వసనీయతను దెబ్బతీసే చర్య అని పలువురు టెక్ నిపుణులు మండిపడ్డారు.
వివాదం ముదరడంతో గల్గోటియాస్ యూనివర్సిటీ వివరణ ఇచ్చింది. తమ ప్రతినిధికి సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన లేకపోవడం వల్లే ఈ పొరపాటు జరిగిందని, ఆ రోబోను విద్యార్థుల అభ్యాసం (learning tool) కోసం మాత్రమే ప్రదర్శించామని పేర్కొంటూ బేషరతు క్షమాపణలు కోరింది.
ఆవిష్కరణను తప్పుగా చూపించే ఉద్దేశం తమకు లేదని, కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పుడు ప్రకటన వల్ల ఇంత పెద్ద గందరగోళం ఏర్పడిందని యూనివర్సిటీ యాజమాన్యం సమర్థించుకుంది. అయినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న ఇలాంటి సదస్సులో ఇలాంటి తప్పులు జరగడంపై నెటిజన్లు మరియు విపక్షాలు ప్రభుత్వాన్ని, యూనివర్సిటీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు
.
