విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్నేహితుల మధ్య జరిగిన ఒక చిన్నపాటి వివాదం చిలికి చిలికి గాలివానగా మారి, చివరకు ఒకరి ప్రాణం తీసేవరకు వెళ్ళింది. కంచరపాలెం పరిధిలోని సంజీవయ్య కాలనీలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ ఈ దారుణ హత్యకు దారితీసింది.
పోలీసుల కథనం ప్రకారం.. బోరా మణికంఠ (26) అనే యువకుడికి, అతని స్నేహితుడు సురేంద్ర అలియాస్ కన్నాతో స్వల్ప వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. నిందితుడు సురేంద్ర తీవ్ర ఆగ్రహంతో మణికంఠ గుండె భాగంపై బలంగా పిడిగుద్దులు కురిపించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మణికంఠ అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే కంచరపాలెం సీఐ కోరాడ రామారావు మరియు ఎస్.ఐ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, ఆర్ఎఫ్ఎస్ఎల్ (RFSL) బృందాలు అక్కడకు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించి కీలక ఆధారాలను సేకరించాయి. అనంతరం మణికంఠ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ (KGH) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హత్య అనంతరం నిందితుడు సురేంద్ర అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి విస్తృతంగా గాలిస్తున్నారు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఘర్షణకు గల అసలు కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
