బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే రెండు మూడు రోజుల్లో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ అల్పపీడనం రానున్న రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
వర్షాలతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని జిల్లా కలెక్టర్ మరియు వాతావరణ శాఖ కఠిన నిబంధనలు జారీ చేశారు.
ఇక రేపటి వాతావరణ సూచన ప్రకారం శ్రీకాకుళం, పోలవరం ప్రాంతం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడవచ్చు.
ఈ ఈదురుగాలులు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం, విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదం ఎక్కువగా ఉందని, అందువల్ల తెగిపోయిన విద్యుత్ వైర్లకు ప్రజలు వీలైనంత దూరంగా ఉండాలని అధికారులు ప్రత్యేకంగా హెచ్చరించారు.
