తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, రంగస్థల కళల పరిరక్షణలో విశిష్ట స్థానం సంపాదించుకున్న “సురభి” నాటకరంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందించాలని సీఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు కె. నారాయణ కోరారు. సుమారు 140 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సురభి నాటకరంగం తరతరాలుగా తెలుగు ప్రజలను అలరిస్తూ కళా వైభవాన్ని సజీవంగా నిలుపుతోందని ఆయన పేర్కొన్నారు.
సురభి వంటి నాటక సమాజాలు కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా సమాజానికి విలువలు, సాంస్కృతిక చైతన్యం, సృజనాత్మకతను అందించే కళా కేంద్రాలుగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం వినోదం పేరుతో హీన సంస్కృతిని ప్రోత్సహించే కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత లభిస్తుండగా, కళా విలువలను కాపాడుతూ ప్రజల్లో సాంస్కృతిక అవగాహన పెంచే సంస్థలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అవసరమని అభిప్రాయపడ్డారు.
భారీ బడ్జెట్ చిత్రాలకు మాత్రమే ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించడం కాకుండా ఆర్థిక ఇబ్బందులతో కొనసాగుతున్న సంప్రదాయ నాటకరంగం, జానపద కళలు, రంగస్థల కళాకారులకు కూడా ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. కళా సంపదను పరిరక్షించడం సమాజం, ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు.
తెలుగు కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన సురభి నాటకరంగాన్ని రక్షించి, అభివృద్ధి చేయడం ద్వారా భావితరాలకు విలువైన సాంస్కృతిక వారసత్వాన్ని అందించగలమని కె. నారాయణ తెలిపారు.
