ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఉండాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కచ్చితంగా చెప్పారు. చర్చలలో కూడా “ఇరాన్కు అణ్వాయుధాలు ఉండకూడదు, అదే అత్యంత కీలక విషయం” అని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా హోర్మోజ్ జలసంధి ప్రాంతం గ్లోబల్ ఎనర్జీ సరఫరాలకు కీలక మార్గంగా ఉండటంతో అంతర్జాతీయంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణాలో పెద్ద భాగం జరుగుతుండటంతో, అక్కడి స్థిరత్వం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇక మరోవైపు చైనాతో సంబంధాల విషయంలో కూడా ట్రంప్ సానుకూల సంకేతాలు ఇచ్చారు.
చైనా అధ్యక్షుడు జీ జెన్ పింగ్ హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంపై సంతృప్తిగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా-చైనా మధ్య జరగబోయే సమావేశం చారిత్రాత్మకంగా ఉండే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ చర్చలు ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు అమెరికా ఒత్తిడి కొనసాగుతుండగా, మరోవైపు దౌత్య చర్చలు ముందుకు సాగుతున్న పరిస్థితి పశ్చిమ ఆసియా భవిష్యత్తును నిర్ణయించే కీలక దశగా మారింది.
