కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ కేంద్రం చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఆరోపించారు. శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయంగా చేసే గవర్నర్ ప్రసంగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రాజ్భవన్ మధ్య తీవ్ర వివాదం చెలరేగింది.
రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండా, తనకు నచ్చిన రెండు పంక్తులకే పరిమితమవడం ద్వారా గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం తీవ్ర ఆరోపణలు చేశారు. శాసనసభ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ కేవలం రెండు పంక్తులు మాత్రమే చదివి ప్రసంగాన్ని ముగించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభ్యులకు అభివాదం తెలిపిన అనంతరం, “నా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక, సామాజిక, భౌతిక అభివృద్ధిని రెట్టింపు చేయడానికి కట్టుబడి ఉంది. జై హింద్, జై కర్ణాటక” అని హిందీలో చదివి గవర్నర్ ప్రసంగాన్ని ముగించారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభలో “షేమ్ షేమ్” అంటూ నినాదాలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, “ప్రతి ఏడాది గవర్నర్ శాసనసభ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర కేబినెట్ సిద్ధం చేసిన ప్రసంగాన్ని చదవాలి. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 176, 163ల ప్రకారం గవర్నర్ ప్రభుత్వమే సిద్ధం చేసిన ప్రసంగాన్ని చదవాల్సి ఉంటుంది” అని తెలిపారు.
“ఈ రోజు కేబినెట్ తయారు చేసిన ప్రసంగాన్ని చదవకుండా, గవర్నర్ తన సొంతంగా సిద్ధం చేసిన మాటలను చదివారు. ఇది రాజ్యాంగ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఆర్టికల్ 176, 163లను స్పష్టంగా ఉల్లంఘించారు. అందువల్ల గవర్నర్ తన విధులు, బాధ్యతలను రాజ్యాంగం చెప్పిన విధంగా నిర్వర్తించలేదని చెప్పాల్సి వస్తోంది” అని సిద్ధరామయ్య తీవ్రంగా విమర్శించారు.
గవర్నర్ కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ‘పప్పెట్’లా వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ వ్యవహారంపై నిరసన చేపట్టనున్నట్లు, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని సీఎం వెల్లడించారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు ఉండటంతోనే గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా యూపీఏ హయాంలో అమలైన ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్రేగా)ను కేంద్రం ‘రద్దు చేసింది’ అన్న ప్రస్తావనతో పాటు నిధుల పంపకం వంటి అంశాలపై కేంద్రాన్ని విమర్శించే 11 పేరాగ్రాఫ్లు ఉండటాన్ని గవర్నర్ తొలగించాలని కోరినట్లు సమాచారం. ఈ కారణంగానే బుధవారం గవర్నర్ సంప్రదాయ ప్రసంగాన్ని ఇవ్వడానికి నిరాకరించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
