కర్ణాటక నుంచి సింగపూర్కు వెళ్లి అక్కడ పర్యావరణ పరిరక్షణ, సమాజ సేవ, సాంస్కృతిక వారసత్వ రంగాల్లో ప్రభావశీల నేతగా గుర్తింపు పొందిన కీర్తిదా మేకాని కన్నుమూశారు. ఇంట్లోనే గుండెపోటుకు గురై ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె వయసు 66 సంవత్సరాలు.
పర్యావరణ రంగంలో చేసిన విశిష్ట సేవలకు సింగపూర్ అధ్యక్ష అవార్డు అందుకున్న కీర్తిదా మేకాని, 2024లో సింగపూర్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్ లో కూడా చోటు దక్కించుకున్నారు. ఆమె సేవల వారసత్వం సింగపూర్లోని హరిత ఉద్యానవనాలు, కమ్యూనిటీ గార్డెన్లు, విద్యాసంస్థలు, సాంస్కృతిక కేంద్రాలలో నాటుకుపోయిందని ఆన్లైన్ టాబ్లాయిడ్ tabla నివేదించింది.
జనవరి 19న ఆమె అకస్మికంగా మరణించినట్లు ప్రకటించారు. ట్రీ లేడీ గా సుపరిచితమైన కీర్తిదా మేకాని గత మూడు దశాబ్దాలుగా ప్రభావవంతంగా తీర్చిదిద్దిన సింగపూర్ పర్యావరణ, కళా, పౌర సమాజ వర్గాల్లో తీరని లోటును మిగిల్చింది. కీర్తిదా మేకాని పర్యావరణంపై ప్రేమ కర్ణాటకలోని కుటుంబ వ్యవసాయ భూముల్లో బాల్యంలోనే మొదలైంది. తొ
లుత దుర్వాసన వచ్చే కంపోస్ట్ గుంట చివరికి సారవంతమైన మట్టిగా మారడాన్ని చూసిన అనుభవమే ప్రకృతి పునరుజ్జీవన శక్తిపై ఆమెకు అవగాహన కలిగించింది. అదే అనుభవం ఆమె జీవిత తత్వంగా మారింది. ప్రకృతిని అర్థం చేసుకుని గౌరవిస్తే, అది మానవాళికి స్థిరమైన జీవన విధానాన్ని నేర్పుతుందని ఆమె నమ్మకం.
1990లో భర్త భారత్ మేకానితో కలిసి సింగపూర్కు వెళ్లిన కీర్తిదా, చాంగీ విమానాశ్రయం నుంచి నగరానికి వెళ్లే దారిలో కనిపించిన పచ్చదనం తనను ఆకట్టుకుందని ఆమె తరచూ చెప్పుకొచ్చేది. అదే దృశ్యం, తరువాత సింగపూర్లో పౌరుల ఆధ్వర్యంలో ప్రారంభమైన అత్యంత విజయవంతమైన పర్యావరణ ఉద్యమాలకు బీజం వేసింది.
1993లో ఆమె సింగపూర్ ఎన్విరాన్మెంట్ కౌన్సిల్ స్థాపక కార్యనిర్వాహక డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టి, నాలుగేళ్లపాటు పాఠశాలలు, వ్యాపార సంస్థలు, సమాజం కోసం 50కిపైగా పర్యావరణ పరిరక్షణ, అవగాహన కార్యక్రమాలను రూపొందించి అమలు చేశారు.
ఆ పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా ఆమె పర్యావరణ విద్య, యువ నాయకుల మార్గనిర్దేశం, సంస్థలకు సలహాలిచ్చే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆమెకు అత్యంత గర్వకారణమైన కార్యక్రమం ప్లాంట్-ఎ-ట్రీ ప్రోగ్రామ్. 2007లో సింగపూర్ నేషనల్ పార్క్స్ బోర్డు, గార్డెన్ సిటీ ఫండ్తో కలిసి దీనిని ప్రారంభించారు.
మొదట ప్రజల స్పందనపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, ప్రకృతితో వ్యక్తిగత అనుబంధానికి అవకాశం ఇస్తే సింగపూర్ ప్రజలు తప్పకుండా ముందుకు వస్తారని కీర్తిదా గట్టిగా నమ్మారు. ఆమె నమ్మకం నిజమైంది. ఈ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 76,000కిపైగా చెట్లు నాటారు.
200కు పైగా స్థానిక వృక్ష జాతులను పరిచయం చేశారు. లక్ష మందికి పైగా ప్రజలు ఇందులో భాగస్వాములయ్యారు. ఇది సింగపూర్లో ప్రజలే నడిపే అత్యంత దీర్ఘకాలిక హరిత ఉద్యమాల్లో ఒకటిగా నిలిచింది. భర్త భారత్ మేకానితో కలిసి “గ్రీన్ కపుల్”గా పేరొందిన కీర్తిదా, వ్యాపార జీవితాన్ని సమాజ సేవతో మేళవిస్తూ విరాళాలు, స్వచ్ఛంద సేవ, బోర్డు స్థాయి బాధ్యతల ద్వారా అనేక కార్యక్రమాలకు మద్దతు అందించారు.
ఆమె గార్డెన్ సిటీ ఫండ్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యురాలిగా పనిచేయడమే కాక, దేశవ్యాప్తంగా 1,900 కమ్యూనిటీ గార్డెన్లను, 45,000 మంది స్వచ్ఛంద తోటమాలీలను కలుపుతూ నడిచే కమ్యూనిటీ ఇన్ బ్లూమ్ ఉద్యమానికి అంబాసిడర్గా కూడా సేవలందించారు. “స్థిరత్వం బోధించాల్సిన విషయం కాదు, జీవించి చూపించాల్సిన విలువ” అన్నదే కీర్తిదా మేకాని జీవన తత్వం.
అలాగే ఆమె యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియా ఫౌండేషన్ ట్రస్టీగా, రైన్ఫారెస్ట్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్కు మద్దతు ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్లో విద్యార్థులు ప్రమాదంలో ఉన్న అరణ్య వృక్ష జాతులను పెంచి, సింగపూర్ రైలు మార్గాల వెంబడి తిరిగి నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కీర్తిదా మేకాని మృతి సింగపూర్తో పాటు ఆమె జన్మభూమి కర్ణాటకలోనూ పర్యావరణ ప్రేమికులను విషాదంలో ముంచెత్తింది.
