అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పర్యటనలో.. రైతుల కోసం పోరాటం చేస్తున్నానంటూ.. అదే రైతుల ముందు అభాసుపాలయ్యారు. కూటమి ప్రభుత్వం రైతులకు వడ్డీ లేకుండా 50 వేల రూపాయలు రుణం ఇస్తామని ప్రకటించడంతో.. దాన్ని కౌంటర్ చేయడానికి.. వైసీపీ హయాంలో వడ్డీ లేకుండా లక్ష రూపాయల రుణాలు ఇచ్చామని చెప్పారు. పక్కనే ఉన్న రైతు స్పందిస్తూ.. వైసీపీ పాలనలో అలాంటి రుణాలేమీ లేవు.. ఎవరికీ ఇవ్వలేదని చెప్పేసరికి లైవ్లో జగన్ గాలి పోయింది.
ఈ ఏడాది రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తి భారీగా పెరిగింది. 2024-25లో పొగాకు రేట్లు భారీగా పెరగడంతో 2025-26 పంట కాలంలో గతం కంటే ఎక్కువ విస్తీర్ణంలో రైతులు పొగాకు పంట పండించారు. ఉత్పత్తి కూడా ఎక్కువగా వచ్చింది. ఇదే సమయంలో ఇరాన్ – అమెరికా యుద్ధం, సిగరెట్లు ఇతర టొబాకో ఉత్పత్తులపై కేంద్రం పన్నులు పెంచడంతో.. పొగాకు రేటు పడిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంతో చర్చించి రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా కృషి చేసిన కూటమి ప్రభుత్వం.. పొగాకు రైతులకు వడ్డీ లేకుండా 50 వేల రూపాయల రుణం ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయంపై అవగాహన లేకుండా మాట్లాడిన జగన్.. వైసీపీ హయాంలో రైతులకు వడ్డీ లేకుండా లక్ష రూపాయల రుణాలు ఉన్నాయని చెప్పగా.. అలాంటివేమీ లేవని పక్కనే ఉన్న రైతు కుండ బద్దలు కొట్టారు. వాస్తవానికి వైసీపీ పాలనలో ఏనాడు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించలేదు. అయినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పొగాకు పండించే రైతులు ఎక్కువ. పంట ఉత్పత్తి కూడా ఇక్కడి నుంచే ఎక్కువగా వస్తుంది. కానీ రాజకీయం కోసమే.. జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పొగాకు అంశంపై మాట్లాడారని కూటమి పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఇక గోపాలపురంలో జగన్ పర్యటనలో పొగాకు రైతులు ఎంత మంది ఉన్నారో తెలియదు గానీ.. ఆయన రైతుల గురించి మాట్లాడిన మాటల కంటే.. సీఎం.. సీఎం నినాదాలే గట్టిగా వినిపించాయి. నిజమైన రైతులే అయితే.. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని.. పొగాకు కొనుగోలు పెంచాలని నినాదాలు చేసే వాళ్లు. దీన్ని బట్టే.. జగన్ పర్యటన ఉద్దేశం పొగాకు రైతుల సమస్య పరిష్కారం కాదని అర్ధమవుతోంది.
