తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ సనాతన ధర్మం.. ఆచారాలు, సంప్రదాయాలు పాటించే వారు మాత్రమే ఉద్యోగులుగా ఉండాలని ధార్మిక సంఘాలు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వాల హయాంలో అనేక మంది అన్యమతస్తులు టీటీడీలో ఉద్యోగం పొందారు. వీరిలో చాలా మంది హిందువులమని చెప్పుకొని ఉద్యోగంలో చేరగా.. కొంత మంది మాత్రం.. తాము ఇతర మతాలకు చెందిన వారిమని.. జాబ్లో చేరే సమయంలోనే డిక్లేర్ చేశారు. ఇలా ముందుగానే తాము హిందువు కాదు అని చెప్పిన వారిని వీఆర్ఎస్పై పంపించాలని దేవస్థానం బోర్దు నిర్ణయించింది.
ఇప్పటికే 9 మంది అన్య మతాలకు చెందిన ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. ఇప్పుడు మరో 33 మందికి వీఆర్ఎస్ ఇవ్వాలని టీటీడీ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 24 మందికి పెన్షన్ సౌకర్యం ఉంది. 9 మందికి పెన్షన్ పథకం లేదు. అయితే ఉద్యోగంలో చేరినప్పుడు హిందువులమని చెప్పుకొని.. తర్వాత ఇతర మతాల ప్రార్ధనలకు వెళ్తన్న వాళ్లు.. తిరుమల తిరుపతి దేవస్థానంలో వందల సంఖ్యలో ఉన్నారని తెలుస్తోంది. ఈ మధ్య ముగ్గురు ఉద్యోగులు ఆధారాలతో సహా దొరికి పోవడంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇలా ఇతర మతాలకు చెందిన మరో 125 మందికి సంబందించి టీటీడీ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
2019లో తిరుమలలో అన్యమతస్తులపై అప్పటి రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అప్పటి జగన్ ప్రభుత్వం ఎల్వీ సుబ్రమణ్యం.. అభ్యంతరాలను పట్టించుకోకుండా.. ఆయన్ను ఛీఫ్ సెక్రెటరీ పదవి నుంచి తొలగించారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల్లో అందరి కంటే ఉన్నత స్థానంలో ఉండే ఛీఫ్ సెక్రెటరీపైనే వేటు వేయడంతో.. వైసీపీ హయాంలో టీటీడీ అన్యమత ఉద్యోగులపై చర్యలు తీసుకొనేందుకు ఎవరూ సాహసించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తిరుమలలో జరిగిన అపచారాలు, అక్రమాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు.. అన్యమత ఉద్యోగులను టీటీడీ నుంచి బయటకు పంపేందుకు చర్యలు తీసుకొంటున్నారు.
