రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించడం కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాపాలను అసెంబ్లీ సభ్యులు ఎండగట్టారు. దాదాపు మాట్లాడిన ప్రతి ఒక్క శాసనసభ్యుడు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో సహా ప్రతి ఒక్కరూ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరును తప్పుపట్టి, ఆయన చేసిన పాపాలను ఏకరవుపెట్టారు.
ముందుగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ జగన్ గతంలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడని భావించానని, వారు 11 మంది అసెంబ్లీకి వచ్చి ఈ ప్రత్యేక చర్చలో పాల్గొంటారని భావించానని, కానీ వాళ్లకు తప్పుదిద్దుకునే ఆలోచన లేదని విమర్శించారు.
స్పీకర్ తరువాత మాట్లాడిన ప్రతి ఒక్కరూ రాజధాని అమరావతికి జగన్ చేసిన దుర్మార్గాన్ని, రాజధాని రైతులు, ముఖ్యంగా మహిళల పట్ల వ్యవహరించిన తీరును మరోసారి రాష్ట్ర ప్రజలకు గుర్తుచేశారు.
హోంమంత్రి అనిత మాట్లాడుతూ రాజధాని మహిళా రైతులపై నాటి జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా దాడి చేసిందని, మహిళల జుట్టులపట్టుకుని ఈడ్పించందని, వారి ఉసురు జగన్కు తగిలి 11కు పడిపోయారని, అయినా జగన్లో ఇంత మాత్రమైనా మార్పు రాలేదని ఆమె విమర్శలు గుప్పించారు.
జగన్ ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతిని అంగీకరించారని, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి మూడు ముక్కలాటలు ఆడారని, ఈ సందర్భంగా రాజధాని మహిళా రైతులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఆమె వారిని ప్రశంసించారు.
