ఉగ్రవాదిగా అనుమానిస్తున్నడాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ హైదరాబాద్లో అరెస్టు కావడంతో సంచలనం రేగింది. గుజరాత్ రాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) రాజేంద్రనగర్ ప్రాంతంలో మొయినుద్దీన్ను పట్టుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మొయినుద్దీన్ నుంచి విచారణలో కీలక సమాచారం బయటపడింది. మొయినుద్దీన్ భారీ స్థాయిలో విషప్రయోగం చేసి సామూహిక హత్యలు జరపాలని కుట్ర పన్నినట్లు తేలింది.
ఈ కుట్రలో ఆయన ‘రెసిన్’ అనే ప్రమాదకర విష పదార్థాన్ని తయారు చేస్తున్నట్లు గుజరాత్ ఏటీఎస్ గుర్తించింది. ఈ విషాన్ని దేవాలయాల నీటి ట్యాంకుల్లో కలిపి ప్రజలను చంపే ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. మొయినుద్దీన్తో పాటు ఈ కుట్రలో పాల్గొన్న మరో నలుగురిని కూడా ఏటీఎస్ ఇప్పటికే అరెస్టు చేసినట్లు వెల్లడించింది. వీరి నుంచి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, రసాయన పదార్థాల సాంపిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రారంభ విచారణలో మొయినుద్దీన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు అలర్ట్ అయ్యాయి. మొయినుద్దీన్ హైదరాబాదులో ఎవరితో కలిసాడు? ఈ కుట్రలో మరెవరెవరికి పాత్ర ఉందన్న దానిపై గుజరాత్ ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా విచారణ కొనసాగిస్తున్నాయి.
