పశ్చిమాసియా ఘర్షణకు ముగింపు పలికే దిశగా అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనను ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించబడటంతో పాటు సముద్ర మార్గాల ద్వారా వాణిజ్య రవాణా సజావుగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో స్పందించిన ప్రధాని, పశ్చిమాసియాలో కొనసాగిన ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, అనేక దేశాల్లో ప్రాణనష్టం సంభవించిందని పేర్కొన్నారు. అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ప్రపంచానికి సానుకూల పరిణామమని ఆయన అభివర్ణించారు.
ఈ ఒప్పందం అమలు ద్వారా ప్రాంతీయ శాంతి నెలకొనడంతో పాటు అంతర్జాతీయ నౌకాయానానికి స్వేచ్ఛ లభిస్తుందని, వాణిజ్య కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయని భారత్ ఆశిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. అలాగే వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఇంకా మిగిలి ఉన్న వివాదాస్పద అంశాలు చర్చల ద్వారానే పరిష్కారం కావాలని ఆయన సూచించారు. స్థిరమైన, దీర్ఘకాలిక తుది ఒప్పందం దిశగా చర్చలు కొనసాగాలని ఆకాంక్షించారు.
ప్రధాని వ్యాఖ్యలకు కొద్ది గంటల ముందే అమెరికా, ఇరాన్ దేశాలు శత్రుత్వ చర్యలను తక్షణమే నిలిపివేయడం, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హోర్మోజ్ జల సంధి తిరిగి తెరవడం వంటి అంశాలతో కూడిన శాంతి అవగాహనకు వచ్చినట్లు ప్రకటించాయి. ఈ ఒప్పందంపై అధికారిక సంతకాలు స్విట్జర్లాండ్లో జూన్ 19న జరగనున్నట్లు సమాచారం. అయితే ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలు ఇంకా పరిష్కారానికి రావాల్సి ఉందని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
పశ్చిమాసియా సంక్షోభాన్ని భారత్ అత్యంత నిశితంగా గమనిస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషించే హోర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన ఉద్రిక్తతలు భారత ప్రయోజనాలపై కూడా ప్రభావం చూపాయి. వాణిజ్య నౌకల భద్రత, సముద్ర మార్గాల స్వేచ్ఛ, ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ స్థిరత్వం కోసం భారత్ గత కొన్ని నెలలుగా దౌత్యపరంగా నిరంతరం పిలుపునిస్తోంది.
