భారత్–అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఒప్పందానికి తుది రూపు ఇవ్వడానికి అమెరికా ప్రతినిధి బృందం జూన్ 1 నుంచి 4 వరకు భారత్లో పర్యటించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అధికారి బుధవారం వెల్లడించారు.
పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి రూపకల్పన చేయాలని భారత్, అమెరికా దేశాలు ఫిబ్రవరి 7న సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అదే సమయంలో విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను కూడా కొనసాగించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి.
ఈ ఒప్పంద చర్చల భాగంగా భారత ప్రతినిధి బృందం ఏప్రిల్ 20 నుంచి 23 వరకు వాషింగ్టన్లో అమెరికా అధికారులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించింది. తదుపరి చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా ప్రధాన చర్చాకర్త నేతృత్వంలోని బృందం భారత్కు రానుందని అధికారులు తెలిపారు. ఈ సమావేశాల్లో తాత్కాలిక ఒప్పందానికి సంబంధించిన అంశాలను ఖరారు చేయడంతో పాటు, విస్తృత వాణిజ్య ఒప్పందంలోని పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
మార్కెట్ ప్రవేశ అవకాశాలు, వాణిజ్యేతర అడ్డంకులు, కస్టమ్స్ సౌలభ్యాలు, వాణిజ్య ప్రోత్సాహం, పెట్టుబడుల పెంపు, ఆర్థిక భద్రత సమన్వయం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా ఉండనున్నాయి.
