వైట్ హౌస్ లో జరిగిన కాల్పులు చూసి తాను భయపడలేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. సీబీఎస్ ‘60 Minutes’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కాల్పుల సమయంలో తాను భయపడలేదని, ప్రపంచం అస్తవ్యస్తంగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకుంటానని పేర్కొన్నారు.
అమెరికాలో జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వార్షిక విందు సందర్భంగా కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వాషింగ్టన్ డీసీలోని ఒక హోటల్లో ఈ కార్యక్రమం జరుగుతుండగా, బాల్రూమ్కు పై అంతస్తులో కాల్పులు జరగడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాల్పులు వినిపించగానే సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వెంటనే స్పందించి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే ఈ సమయంలో తాను పరిస్థితిని స్వయంగా చూడాలనుకున్నానని ట్రంప్ తెలిపారు.
మొదట ఇది సాధారణ శబ్దం అనుకున్నప్పటికీ, తర్వాత పరిస్థితి తీవ్రమైనదని గ్రహించినట్లు ట్రంప్ చెప్పారు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో తాను కాస్త ఆలస్యంగా స్పందించానని, అందువల్ల సీక్రెట్ సర్వీస్ సిబ్బంది తనను త్వరగా తరలించడంలో కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు.
ఈ ఘటనతో కార్యక్రమంలో పాల్గొన్నవారిలో భయాందోళనలు నెలకొన్నాయి. కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, కాల్పులకు కారణాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.
