తమ సముద్ర భాగంలో ఏదైనా నౌకకు ప్రమాదం జరిగితే సాధ్యమైనంత వరకు ప్రాణనష్టం జరగకుండా చూస్తామని శ్రీలంక ప్రకటించింది. శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధ నౌక పై అమెరికా దాడి చేసి 87 మందిని పొట్టన పెట్టున్న విషయం తెలిసిందే. మొత్తం 130 మంది నావికులు ఉన్న ఇరాన్ యుద్ధ నౌక IRIS Dena ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జరిగిన ఒక ప్రదర్శనలో పాల్గొని తిరిగి వెళుతుండగా అమెరికా తన జలాంతర్గామితో దాడి చేసింది.
నౌకలో ఉన్న 130 మంది మరణించినట్లుగా భావిస్తున్నా ఇప్పటి వరకు 87 మృతదేహాలు లభించాయి. తమ సముద్ర పరిధి వద్ద మరో ఇరాన్ నౌక కనిపించిందని శ్రీలంక ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఆ నౌకలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధి నలిందా జయతీష పార్లమెంట్లో మాట్లాడుతూ, శ్రీలంక ప్రత్యేక ఆర్థిక మండలంలో మరో ఇరాన్ నౌక ఉన్నట్టు అధికారులకు సమాచారం ఉందన్నారు.
ఆ నౌక సైనిక నౌకా కాదా అన్న విషయం స్పష్టంగా తెలియకపోయినా, పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తున్నామని చెప్పారు. ఇరాన్ నౌకాదళానికి చెందిన IRIS Dena యుద్ధ నౌక గాలే పోర్ట్ నగరానికి సుమారు 19 నాటికల్ మైళ్ల దూరంలో దాడికి గురైంది. సముద్రంలో నుంచి వెలికితీసిన మృతదేహాలను నిల్వ చేసేందుకు కొలంబో నుంచి రెండు ప్రత్యేక శీతలీకరణ యూనిట్లను కూడా పంపినట్టు శ్రీలంక అధికారులు వెల్లడించారు.
ఈ దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, అంతర్జాతీయ జలాల్లో ఎలాంటి హెచ్చరిక లేకుండా తమ నౌకపై దాడి జరిగిందన్నారు. గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ప్రాంతానికి వేల కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఈ చర్యకు అమెరికా తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సి వస్తుందని ఆయన సోషల్ మీడియా వేదిక Xలో హెచ్చరించారు.
