నర్సీపట్నం మండలం వేములపూడి పంచాయతీ పరిధిలోని పెద ఉప్పరగుడెం గ్రామంలో భగీరథ వంశీకుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాములు, వినాయకుడు మరియు లక్ష్మీదేవి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కు గ్రామస్థులు, మహిళలు మేళతాళాలు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. గ్రామస్తులంతా ఐకమత్యంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ రామాలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. నియోజకవర్గంలోని నాతవరం, వేములపూడి, అమలాపురం తదితర ప్రాంతాల్లో నిరంతరం పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
పెద ఉప్పరగుడెం గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, వేములపూడి నుంచి ఉప్పరగుడెం వరకు తారు రోడ్డు నిర్మాణానికి రూ. 32 లక్షలు మంజూరు చేశామని వెల్లడించారు. అలాగే పొలాలకు వెళ్లేందుకు వీలుగా కాలువ పనుల కోసం రూ. 2 కోట్లు కేటాయించామన్నారు. విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ స్కూల్ భవనానికి రూ. 13 లక్షలు, అంగన్వాడీ భవనానికి రూ. 3 లక్షలు, వేములపూడి పంచాయతీకి మొత్తం రూ. 4 కోట్లు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు.
విద్యార్థినుల సౌకర్యార్థం వారు చదువుకోవడానికి వీలుగా ఆశ్రమ పాఠశాలలు (హాస్టల్స్) మంజూరు చేశామని, వేములపూడిలో కూడా 50 సెంట్ల స్థలంలో బాలికల హాస్టల్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ ఊరి పేరును కూడా మార్చి కొత్త పేరును అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.
రిపోర్టర్ శివ, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా
