“గడచిన దశాబ్ద కాలంగా భారతదేశంలో కేవలం విధివిధానాల వల్లే కాకుండా, ఆలోచన విధానాల మార్పులతో అభివృద్ధి బలపడింది.” అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన CII పార్ట్నర్షిప్ సమ్మిట్లో మాట్లాడారు.
భారత ఉప రాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ సెంట్రల్ మినిస్టర్ ప్రియుష్ గోయల్ ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెమ్మసాని మాట్లాడుతూ భారత ఎదుగుదల అనే కథను మనందరం కలిసి రాయాలి అని కోరారు.
దేశ అభివృద్ధి అనేది స్పష్టమైన విధానాలు, కచ్చితమైన అమలుతో పాటు మరియు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వచ్చిన పారిశ్రామిక శక్తి ఫలితమని పేర్కొన్నారు. డాక్టర్ చంద్రశేఖర్ టెలికం రంగంలో USD 25 బిలియన్ పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కొత్త కంపెనీలు, పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేయడానికి కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందని వివరించారు.
భారతదేశంలో పెట్టుబడి పెట్టడం అంటే ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న మధ్యతరగతి మార్కెట్తో అనుసంధానం అవడమే గాక, రాబోయే దశాబ్దాల్లో గ్లోబల్ వ్యాపారాన్ని ప్రభావితం చేసే అభివృద్ధి ప్రయాణంలో భాగమవడం అని ఆయన అన్నారు. భారతదేశం గతంలో ఉన్న లైసెన్స్ రాజ్ విధానం నుండి ‘ట్రస్ట్-ఫస్ట్’ దృక్పథానికి మారిందని, వ్యాపారవేత్తలను ఇక అనుమానంతో కాకుండా దేశ నిర్మాణంలో భాగస్వాములుగా గుర్తిస్తున్నామన్నారు.
ఇటీవలి సంవత్సరాల్లో అమలు చేసిన ముఖ్య సంస్కరణల గురించి ఆయన మాట్లాడుతూ..
USD 1.4 ట్రిలియన్ మౌలిక వసతుల పెట్టుబడులు,
USD 26 బిలియన్ PLI పథకాలు,
సరళీకృత కార్మిక చట్టాలు,
రిట్రోస్పెక్టివ్ పన్ను రద్దు,
GST ద్వారా జాతీయ మార్కెట్ ఏకీకరణ,
ఇన్సాల్వెన్సీ & బ్యాంక్రప్సీ కోడ్
ఇవన్నీ భారత్ను వినియోగదారుడి మార్కెట్ నుండి విశ్వసనీయ తయారీ & ఆవిష్కరణ కేంద్రంగా మార్చాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి అవకాశాలను పరిచయం చేస్తూ, డాక్టర్ చంద్రశేఖర్ రాష్ట్రాన్ని భారతదేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న పెట్టుబడి గమ్యస్థానాల్లో ఒకటిగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం బలమైన పారిశ్రామిక వాతావరణాన్ని నిర్మించిందని పేర్కొన్నారు.
అలాగే, ఆంధ్ర ప్రదేశ్కు ఉన్న బలాలు
ఆరు ప్రధాన పోర్టులు,
సిద్ధంగా ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంకులు,
విస్తారమైన పునరుత్పాదక శక్తి సామర్థ్యం,
వేగం & పారదర్శకతపై దృష్టి పెట్టిన పరిపాలన
అనేవి పెట్టుబడులకు రాష్ట్రాన్ని మరింత అనుకూలంగా చేస్తున్నాయని చెప్పారు.
