26.7 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

ఐపీఎస్‌ అధికారిపై వరకట్న వేధింపుల కేసు

కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఒక ఐపీఎస్ అధికారిపై, ఆయన కుటుంబ సభ్యులు ఏడుగురిపై వరకట్న వేధింపులు, గృహ హింస మరియు మానసిక క్రూరత్వం ఆరోపణల కింద ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐపీఎస్‌ అధికారి శివాన్షు రాజ్‌పుత్ (2019 బ్యాచ్), ప్రస్తుతం బెంగళూరులో స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎస్‌సీఆర్‌బీ) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పీ)గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య, నోయిడాకు చెందిన డాక్టర్ కృతి సింగ్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.

డాక్టర్ కృతి సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. 2021 డిసెంబర్‌లో తమ వివాహం జరిగింది. పెళ్లి సమయంలో తన కుటుంబం రూ. 2 కోట్లకు పైగా ఖర్చు చేసిందని, ఇందులో లక్షల రూపాయల విలువైన ఆభరణాలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు.

పెళ్లైనప్పటి నుంచీ తన భర్త, అత్తమామలు వరకట్నం కోసం వేధించడం ప్రారంభించారని, ఈ వేధింపులు మానసిక, శారీరక హింసకు దారితీశాయని ఆరోపించారు.

తన శరీర రంగు (complexion) గురించి కూడా తరచుగా అవమానించేవారని, అదనపు డబ్బు కోసం ఒత్తిడి చేసేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఐపీఎస్ అధికారి అయిన తన భర్తకు ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, దీనిని ప్రశ్నించినందుకు తనను వదిలిపెడతానని బెదిరించారని ఆమె ఆరోపించారు.

అంతేకాక, తన భర్త తన అధికారిక హోదాను ఉపయోగించి తన తల్లిదండ్రులను భయపెట్టేందుకు ప్రయత్నించారని కృతి సింగ్ ఆరోపించారు.

ప్రస్తుతం డాక్టర్ కృతి సింగ్ తన రెండేళ్ల కొడుకుతో కలిసి నోయిడాలో విడిగా ఉంటున్నారు. గౌతమ బుద్ధ నగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఉమెన్స్ సేఫ్టీ)ని సంప్రదించిన తర్వాత పోలీసులు సెక్షన్ 498ఏ (వరకట్న వేధింపులు), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 506 (క్రిమినల్ బెదిరింపు) మరియు వరకట్న నిషేధ చట్టంలోని ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ ఆరోపణలను ఐపీఎస్ అధికారి శివాన్షు రాజ్‌పుత్ ఖండించారు. తాను కూడా గృహ హింసకు గురయ్యానని, తనపై వచ్చిన ఆరోపణల్లో ఒక్కటి నిరూపించినా పదవికి రాజీనామా చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలో నిందితుల వాంగ్మూలాలను నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Related posts

వైభవంగా శ్రీ మాధవరాయ మహోత్సవం

Satyam News

తిరుపతిలో వెల్లివిరుస్తున్న శ్రీవారి బ్రహ్మోత్సవ శోభ

Satyam News

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

Satyam News

సోషల్ మీడియాలో తోక ముడిచిన అబద్ధాల ముఠా

Satyam News

నెల్లూరు తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన

Satyam News

పవిత్ర తిరుమల కొండపై కర్ణాటక కుట్ర

Satyam News

Leave a Comment