వీధి కుక్కల విషయంలో సుప్రీం కోర్టు శుక్రవారం నాడు మరిన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రజలు ఎక్కువగా వచ్చే ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కుక్కలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డాగ్ షెల్టర్లకు తరలించాలని కోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తి విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
ఒకసారి కుక్కలను ఆ ప్రదేశాల నుంచి తరలించిన తర్వాత, వాటిని తిరిగి అదే ప్రదేశాల్లో వదలకూడదని కోర్టు ఆదేశించింది. ప్రజా భద్రత, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. అదే విధంగా, వీధి కుక్కల సంరక్షణ, నిర్వహణకు సంబంధించిన అంశాలపై అమికస్ క్యూయరీ సమర్పించిన సిఫార్సులను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది.
రాష్ట్రాలు ఈ ఆదేశాలను తక్షణం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. వీధి కుక్కల వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, దాడుల ఘటనలను అరికట్టడం ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యమని కోర్టు స్పష్టం చేసింది.
