దాదాపు 40 ఏళ్లుగా తనను నమ్ముకున్న కార్యకర్తల ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి, కేసీఆర్ వంటి నాయకుడితో జతకట్టడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి విమర్శించారు. జీవన్ రెడ్డి లాంటి అనుభవజ్ఞుడు కేసీఆర్ ముందు చేతులు కట్టుకుని నిలబడటం జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేనని మండిపడ్డారు.
ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు తాము ప్రయత్నిస్తుంటే, ఆయన వెళ్లి ప్రతిపక్షంలో చేరారని ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామంటే అడ్డుకోవడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగిత్యాల జిల్లా ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రస్తుత పరిస్థితులు, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీని వీడటం వెనుక ఉన్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
జగిత్యాల నాయకులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను పంచుకోవడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదని, ఆయన మర్యాదకు భంగం కలిగేలా ఎప్పుడూ వ్యవహరించలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం పార్టీ శ్రేణులన్నీ శక్తివంచన లేకుండా కృషి చేశాయని గుర్తు చేశారు.
పార్లమెంటు ఎన్నికల సమయంలో జీవన్ రెడ్డిని కరీంనగర్ నుండి పోటీ చేయమని సూచించినప్పటికీ, ఆయన కోరిక మేరకు నిజామాబాద్ టికెట్ ఇచ్చామని, అయితే దురదృష్టవశాత్తు అక్కడ ఓటమి ఎదురైందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఆయన సూచించిన వారికే ప్రాధాన్యతనిచ్చి టికెట్లు కేటాయించామని చెప్పారు. భవిష్యత్తులో ఆయనకు మరియు ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ ఎదుగుదలకు పూర్తి హామీ ఇచ్చినప్పటికీ, జీవన్ రెడ్డి మొండి పట్టుతో పార్టీని వీడారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యక్తి కంటే పార్టీయే ముఖ్యమని నమ్మి కాంగ్రెస్లోనే కొనసాగుతున్న నాయకులను, కార్యకర్తలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు త్వరలోనే తాను జగిత్యాలలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా ఉండి జగిత్యాలను అభివృద్ధి చేసుకుందామని, రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
