మాజీ మంత్రి జోగి రమేష్ తన మతాన్ని దాచిపెట్టి కొడుకు పెళ్లి చేసినట్లు ఆయన కొత్త కోడలు పెట్టిన కేసు వివరాలు పరిశీలిస్తే స్పష్టం అవుతున్నది. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల నమ్మకాలు, సంప్రదాయాలు, విశ్వాసాల కలబోత.
కానీ, ఆ ఆధ్యాత్మిక విశ్వాసాలను, రాజకీయాన్ని పీఠభూమిగా చేసుకుని, అమ్మవారి సన్నిధిలోనే అబద్ధ ప్రమాణాలు చేస్తూ ఒక ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన దారుణ సంఘటన ఇబ్రహీంపట్నం పీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ ద్వారా.. అదే సమయంలో జరిగిన డ్రామాల ద్వారా వెలుగులోకి వచ్చింది.
పెళ్లి సంబంధం మాట్లాడుకునే సమయంలో జోగి రమేష్ కుటుంబం తమది పక్కా హిందూ సంప్రదాయ కుటుంబమని ఆడపెళ్లివారిని నమ్మించింది. పెళ్లి సమయాన నూతన వధువుకు నమ్మకం కలిగించేందుకు ఇంట్లో హిందూ దేవుళ్ల చిత్రపటాలను ప్రత్యేకంగా అమర్చారు. తీరా వివాహం ముగిసి మెట్టినింట ఆమె అడుగు పెట్టిన మరుసటి రోజే ఆ పటాలన్నీ మాయమయ్యాయి. తాము ఇప్పటికే క్రైస్తవ మతంలోకి మారిన విషయాన్ని బయటపెట్టారు.
సరేనని గదికే పరిమితమై అమ్మవారిని పూజించుకోవడానికి కొత్త కోడలు మేఘన ప్రయత్నిస్తే.. అగరబత్తి వెలిగించినందుకు “ఇంట్లో శవం ఉన్నట్టు దుర్వాసన వస్తోంది” అంటూ హేళన చేశారు. కొత్త జంటను ఆలయాలకు తీసుకెళ్లడానికి నిరాకరించారు.
మతాన్ని, సంప్రదాయాలను దాచిపెట్టి తమను నిలువునా మోసం చేశారని ప్రశ్నిస్తే.. “ఈ విషయాలు బయటకు చెబితే యాక్సిడెంట్ చేయించి కన్నవారితో సహా నిన్ను చంపేస్తాం” అని బెదిరింపులకు దిగారు. ఇలాంటి విషయాలన్నీ ఆ అమ్మాయి ఫిర్యాదులో ఉన్నాయి.
దుర్గమ్మ తల్లి మేఘనను కాపాడింది
అత్తవారింట్లో దిండు ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చంపేసేందుకు యత్నించినప్పుడల్లా ఆ దుర్గమ్మ తల్లి మహిమ వల్లే మేఘన ప్రాణాలతో బయటపడింది. ఏ అమ్మవారి ముందయితే ఈ కుటుంబం నిరాటంకంగా బిడ్డల మీద అబద్ధ ప్రమాణాలు చేసిందో, రాజకీయంగా సింపతీ డ్రామాలు ఆడిందో.. ఆ కనకదుర్గమ్మే ఈ రోజు ఆ బిడ్డ, కుటుంబ అసలు రంగును, రాక్షసత్వాన్ని బాధితురాలి ద్వారా సమాజం ముందు నడిబొడ్డున నిలబెట్టింది!
దేవుడి పేరు చెప్పి మోసం చేయవచ్చు, సింపతీ కోసం సొంత ఇల్లు ధ్వంసమైనట్టు డ్రామాలు ఆడవచ్చు.. కానీ ధర్మం, న్యాయం ఎప్పుడూ ఒకేలా ఉండవు. పెళ్లికి ముందు మతాన్ని దాచి, పెళ్లి తర్వాత ఆమె విశ్వాసాలను హేళన చేస్తూ నరకం చూపించిన ఆ కుటుంబంలోని వారికి ఇప్పుడు చట్టంతో పాటు ఆ దైవాగ్రహం కూడా ఎదురుకాక తప్పదు. మేఘనను మృత్యుముఖం నుంచి కాపాడిన ఆ అమ్మవారే, ఇప్పుడు ఆమెకు పూర్తి న్యాయం జరిగేలా చేస్తుందని స్థానికులు విశ్వసిస్తున్నారు.
2026 ఫిబ్రవరి నెలలో ఒకవైపు రాజకీయం, మరోవైపు కుటుంబ వివాదాల నడుమ జోగి రమేష్ తన కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడ చేతిలో కర్పూరం వెలిగించి, తమపై ఎలాంటి కల్తీ మద్యం నిందలు లేవని, నిండు మనస్సుతో ఉన్నామని అమ్మవారి సన్నిధిలో ప్రమాణాలు చేస్తూ మీడియా ముందు పెద్ద డ్రామానే ఆడారు. చేతిలో దీపం వెలిగించుకుని ఆర్పారు. అప్పటికే క్రైస్తవుడిగా మారిన జోగి రమేష్ కేవలం హిందువులను మోసం చేయడానికే ఈ డ్రామా ఆడాడని ఇప్పుడు వెల్లడి అవుతున్నది.
సరిగ్గా అదే ఫిబ్రవరి 1, 2026న ఇబ్రహీంపట్నంలోని వారి నివాసంపై పెట్రోల్ బాంబుల దాడి జరిగిందంటూ కలకలం సృష్టించారు. అయితే ఈ ఘటనపై అప్పట్లోనే తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది కేవలం పొలిటికల్ సింపతీ (సానుభూతి) కోసం అని. కానీ ఆ రాజకీయ ముసుగులో కుటుంబంలో జరుగుతున్న దారుణాలను కప్పిపుచ్చుకోవడానికి, లేదా పుట్టింట్లో ఉన్న బాధితురాలిని మరింత భయాందోళనలకు గురిచేయడానికి స్వయంగా ఆడించిన నాటకమా? అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు కానీ ఆమె ఆ ఇంట్లో ఉండి ఉంటే అనే ఊహే భయానకంగా అనిపిస్తోంది.
తీరా చూస్తే ఆ సమయానికి ఇంటి కోడలు మేఘన ఆ ఇంట్లో లేదు! ఆగస్టు 26, 2025నే ఆమెను పుట్టింటికి పంపించేయగా, జూలై 2026 వరకు ఆమె తీవ్ర మరణభయం నడుమ సూర్యాపేటలోనే గడిపింది. జోగి రమేష్ ది రాజకీయ, కుటుంబ, మత, నేరాల డ్రామా గా ఇప్పుడు బయటపడుతున్నది.
