మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా మాత్రం కొత్త అంతర్జాతీయ సమాఖ్య ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభించింది. హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకాయానం నిలిచిపోవడంతో, ఇతర దేశాలను కలుపుకొని “మారిటైమ్ ఫ్రీడమ్ కన్స్ట్రక్ట్” అనే కూటమిని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
ఈ కూటమి ద్వారా సముద్ర మార్గ భద్రత, సమాచార పంచుకోవడం, ఆంక్షల అమలు వంటి అంశాలను సమన్వయం చేయాలని అమెరికా భావిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిలో రాకపోకలు అడ్డంకులు ఎదుర్కొంటుండటం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది.
ఈ పరిస్థితికి ప్రతిస్పందనగా ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమపై ఒత్తిడి కొనసాగితే హోర్మోజ్ జలసంధిలో నౌకాయానాన్ని మరింతగా అడ్డుకుంటామని, అవసరమైతే అపూర్వ సైనిక చర్యలకు దిగుతామని ఇరాన్ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాల ఒప్పందంపై ఇరాన్ స్పష్టత చూపాలని, లేదంటే పరిస్థితులు మరింత దిగజారవచ్చని హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమం శాంతియుతమని ఇరాన్ చెబుతున్నప్పటికీ, అమెరికా మాత్రం దానిని అనుమానంతో చూస్తోంది.
అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి బ్రాడ్ కూపర్ నుంచి ట్రంప్కు కీలక నివేదిక అందనున్నట్టు సమాచారం. ఇరాన్పై “చిన్నవే కానీ శక్తివంతమైన” సైనిక దాడుల ప్రణాళికను సిద్ధం చేసినట్టు అమెరికా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా కీలక మౌలిక వసతులపై దాడులు జరగవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తంగా ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. చమురు సరఫరా అంతరాయం, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం, భద్రతా పరిస్థితుల క్షీణత వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతున్నాయి.
