ఆధ్యాత్మికంహోమ్

శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం

కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక కన్నుల పండువగా, శాస్త్రోక్తంగా జరిగింది. కార్తీక మాసంలో వచ్చే ఈ కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోని స్నపనబేరంగా పిలువబడే, ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఉదయం వేకువజామున 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు.

సూర్యోదయానికి ముందే ఈ ఊరేగింపును నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. చారిత్రక వివరాల ప్రకారం, గతంలో సూర్య కిరణాలు స్వామివారి విగ్రహంపై పడటం వలన అగ్నిప్రమాదం జరిగిందని, అప్పటి నుంచి ఈ ఊరేగింపును సూర్యోదయానికి ముందే నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

వేంకటతురైవార్ అని కూడా పిలువబడే ఉగ్ర శ్రీనివాసమూర్తిని మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం, స్వామి, అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి, అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కైశిక ద్వాదశిని ప్రబోధనోత్సవం లేదా ఉత్తాన ద్వాదశి అని కూడా పిలుస్తారు. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువును మేల్కొల్పే పర్వదినంగా దీనిని భావిస్తారు. శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో ఈ పర్వదినానికి విశేష ప్రాధాన్యత ఉంది.

శ్రీ వరాహ స్వామి కైశిక పురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. అలాగే, సత్యమూర్తి (నంబదువాన్) అనే భక్తుడి భక్తికి మెచ్చి స్వామివారు మోక్షం ప్రసాదించిన కథ కూడా ఈ పర్వదిన ప్రాశస్త్యాన్ని తెలుపుతుంది. ఈ అపురూప వేడుకను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Related posts

బొత్స సత్యనారాయణ కు బ్రెయిన్ స్ట్రోక్

Satyam News

దంపతుల ఆత్మహత్య: అనాథగా 5 నెలల బిడ్డ

Satyam News

శ్రీ కంచి కామకోటి పీఠం విద్యాసంస్థల అడ్మిషన్లు ప్రారంభం

Satyam News

శ్రీవారి పాదసన్నిధిలో సీఎం చంద్రబాబు కుటుంబం

Satyam News

ఇంద్రకీలాద్రిపై  సామూహిక అక్షరాభ్యాసాలకు సర్వం సిద్ధం

Satyam News

భారత జాతికి ద్రోహం చేసిన జవహర్ లాల్ నెహ్రూ

Satyam News

Leave a Comment